పవన్కు దాడి షాకిచ్చారా?: చంద్రబాబూ! మీఅద్భుతాలు చాలు, మోడీకి చెప్పగా విన్నాను
Recommended Video
విశాఖపట్నం: సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేనాని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా దాడిని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ప్రశంసల వర్షం కురిపించుకున్నారు.
చదవండి: అడ్డంగా దొరికారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు?: పవన్పై చంద్రబాబు
ఈ రోజు (మంగళవారం-03 జూలై) దాడి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పవన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. మంచి వ్యక్తి, అనుభవశీలి అయిన దాడిని జనసేనలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆ తర్వాత దాడి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గొప్ప నటుడని, ఆయన కుటుంబంతో మూడు దశాబ్దాలుగా అనుబంధముందన్నారు.
చదవండి: పక్కా ప్లాన్తో పర్యటన, దాడితో పవన్ భేటీ: జనసేనలోకి విశాఖ ఎంపీగా పోటీ చేసిన నేత
పరస్పరం ప్రశంసలు, పవన్కు దాడి షాకిచ్చారా?
పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారని దాడి ప్రశంసించారు. పవన్ పార్టీలోకి ఆహ్వానించడంపై దాడి స్పందిస్తూ.. అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకొని నిర్ణయం చెబుతానని చెప్పారు. పవన్ లాంటి వ్యక్తి పార్టీలోకి ఆహ్వానిస్తే చాలామంది నేతలు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన సెలెక్టివ్గా పార్టీలో చేర్చుకుంటున్నారు. అలాంటి జనసేనానికి దాడి.. కార్యకర్తల అభిప్రాయం తీసుకొని చెబుతానని అనడం ద్వారా ఓ విధంగా షాకిచ్చారని చెప్పవచ్చునని అంటున్నారు.
చంద్రబాబూ! చాలు, ఓసారి సీఎంగా చేస్తే అద్భుతాలు చూశాం
ఇదిలా ఉండగా, చోడవరం బహిరంగ సభలో జనసేనాని సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్లపై నిప్పులు చెరిగారు. మరోసారి సీఎంగా చేస్తే అద్భుతాలు చేస్తానని చంద్రబాబు అంటారని, కానీ చూసింది చాలని, ఓసారి సీఎంగా చేస్తే చంద్రబాబు చేసిన అద్భుతాలను చూశామని, సంతోషమని పవన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారూ మీ అద్భుతాలు ఇక చాలన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనరనే అడ్డంగా దోచేస్తున్నారు
ప్రజలు తన ఆస్తి అని, నా అంతస్తు అని పవన్ అన్నారు. ఉత్తరాంధ్రను టీడీపీ అడ్డంగా దోచిందని నిప్పులు చెరిగారు. భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలంటే చంద్రబాబుకు కాంట్రాక్టుల భయమని, జగన్కు కేసుల భయమని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులను, ఏమీ అనరని, ఎదురు తిరగనే ఉద్దేశ్యంతో అడ్డంగా దోచేస్తున్నారన్నారు.
మీరు నాకు భిక్ష వేస్తారా, నేనే మీకు వేస్తా
2014లో ఓట్లు చీలకుండా చంద్రబాబుకు మద్దతిచ్చింది అక్రమాలు, అన్యాయం చేసేందుకేనా అని పవన్ ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీ నేతలు జనసేన నిర్మాణం గురించి అడుగుతున్నారని, కానీ ఏ పార్టీ నిర్మాణం చూసి 2014లో మా వద్దకు వచ్చి మద్దతు అడిగారని నిలదీశారు. మిమ్మల్ని అడగలేదు.. మీరు నన్ను మద్దతు అడిగారని చెప్పారు. ఇప్పుడు మా పార్టీకి భిక్ష వేస్తారట అని మండిపడ్డారు. మేం వేస్తాం భిక్ష మీరు తీసుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఒక్క ఓటు చీలకుండా మన బలాన్ని టీడీపీకి ధారపోస్తే వీరు చేసింది ఇదీ అన్నారు.
నోట్ల రద్దుపై షాకింగ్.. మోడీకి చెప్పగా నేను విన్నాను
నోట్ల రద్దుపై సీఎం చంద్రబాబుకు ముందే సమాచారం ఉందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే హెరిటేజ్ వాటాలను నోట్ల రద్దుకు ముందే అమ్మేసుకున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని మోడీ గారిని చంద్రబాబు గారు అడగడం నేను విన్నానని, గత ఎన్నికల సమయంలో మద్దతు అడిగితే చంద్రబాబు గారితో ఉత్తరాంధ్ర వలసలు ఆగాలని చెప్పానని, నా దగ్గర మంత్రం ఉంది, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, ఇప్పుడు వాళ్ల బాబుకే జాబు వచ్చిందన్నారు.
మీకు కోట్ల హెరిటేజ్, మా వాళ్లకు వేల విలువ చేసే బైకులు
జనసేనకు గుండె ధైర్యం నిండుగా ఉందని పవన్ అన్నారు. జగన్కు కేసుల భయం, చంద్రబాబుకు కాంట్రాక్టుల భయం అన్నారు. అందుకే ప్రధానితో మాట్లాడి ఏం సాధించడం లేదన్నారు. మేం ఎవరికీ భయపడేది లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చినందుకు తమ జనసైనికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. విజయనగరంలో పార్టీ మీటింగ్కు వస్తున్న యువకుల బైక్స్ పోలీసులు లాక్కొన్నారని ఆరోపించారు. సీఎం అబ్బాయి లోకేష్కు కోట్ల విలువ చేసే హెరిటేజ్ ఉందని, మా జనసైనికులకు ఉన్నవి వేల విలువ చేసే బైకులే అన్నారు. ఈసారి ఎన్నికల్లో బలం చూపిస్తామన్నారు. నాకు ఇంతమంది యువకుల, అక్కాచెల్లెళ్ల బలముందని, తప్పకుండా సరికొత్త రాజకీయం చేద్దామని, జవాబుదారీతనం తీసుకొద్దామన్నారు.