pawan kalyan:ధర్మవరంలో వైసీపీకి జై, జనసేనకు నై, మహిళలపై దాడులా..? పోలీసులపై పవన్ గుస్సా
ధర్మవరం గ్రామంలో పోలీసులు జన సైనికులపై వ్యవహరించిన తీరు సరికాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీ వర్గీయులు నాటకం వేస్తే సహకరించిన పోలీసులు.. జనసేన వర్గం నాటకం వేస్తే ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తించారని ప్రశ్నించారు. ధర్మవరం గ్రామంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. వారికి శాంతియుత పద్ధతితో సమాధానం చెబుతామని వెల్లడించారు.
ఇదీ విషయం..
గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో శనివారం జనసేన వర్గీయులు నాటక ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, పోలీసుల మధ్య జరిగిన వాగ్వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తర్వాత పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురు మహిళలు కూడా గాయపడ్డారు. గ్రామస్తులు తిరగబడి వాహనంపై రాళ్లురువ్వడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. కొద్దిరోజుల క్రితం వైసీపీ వర్గీయులు నాటక ప్రదర్శించిందని.. వారికి పోలీసులు సహకరించారని గ్రామస్తులు చెప్తున్నారు.
భయాందోళన
ధర్మవరం గొడవ సందర్భంగా పోలీసుల అతిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. పోలీసులు దాడిచేయడంతో చాలామంది భయంతో వణికిపోయారని గుర్తుచేశారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు పారిపోయారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు శాంతికి విఘాతం కలిగించారని పేర్కొన్నారు.
నాటక ప్రదర్శనలు చేయొద్దా..?
గ్రామంలో నాటక ప్రదర్శనలు చేయొద్దా అని పవన్ ప్రశ్నించారు. అలా నాటకం ప్రదర్శించే సమయంలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించడం నేరమా అని పవన్ నిలదీశారు. నాటకం ప్రదర్శించే సమయంలో వారిని ఆపి అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని పవన్ కొశ్చన్ చేశారు.
మహిళలపై దాడులా?
నాటకం ప్రదర్శించే సమయంలో వారిని అడ్డుకోవడమే కాకుండా.. మహిళలని కూడా చూడకుండా దాడి చేయడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. అడ్డుకోవద్దని నిలదీస్తే మహిళలని కూడా చూడకుండా దాడులు చేయడం సమంజసం కాదన్నారు. నాటకం ప్రదర్శించే సమయంలో కార్యకర్తలపై దాడులు చేయమని పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారని నిలదీశారు.
చర్యలు తీసుకొండి
జనసేన వర్గీయులపై దాడుల గురించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు జనసేన కార్యకర్తలు నాగేశ్వరరావు, బీ రమేశ్ను వెంటనే విడుదల చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దీంతోపాటు 32 మందిపై నమోదుచేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని తేల్చిచెప్పారు.
Recommended Video
శాంతియుత మార్గంలోనే
జనసైనికులపై దాడిచేసిన వారికి శాంతియుత మార్గంలో సమాధానం చెబుతామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పోలీసుల దాడుల్లో గాయపడ్డ బాధితులకు జనసేన పార్టీ అండగా నిలుస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.