పవన్ కళ్యాణ్ అపోహ పడొద్దు, వివరిస్తాం: టిడిపి ఎమ్మెల్యే బోండా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తలపెట్టిన భూసేకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు స్పందించారు. రాజధాని భూసేకరణపై పవన్ కళ్యాణ్కు అపోహ వద్దని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
అవసరమైతే తాము పవన్ కళ్యాణ్ను కలిసి వాస్తవాలను వివరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాలపై ఇప్పటికే ముఖ్య కార్యదర్శిని ఢిల్లీకి పంపించినట్లు తెలిపారు.
బాధ్యత చంద్రబాబుకు
ఇదిలావుంటే, టీడీపీ కేంద్ర కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు టిడిపి ముఖ్య నేతల సమావేశంలో శనివారంనాడు నిర్ణయం తీసుకున్నారు. కమిటీని నియమించే అధికారాన్ని సీఎం చంద్రబాబుకు అప్పగించారు. ఈనెల 25న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం టీడీపీ నేత బోండా ఉమ ఆశాభావం వ్యక్తం చేశారు. 95 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారని, 3 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.
గ్రామ కంఠాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
రాజధానిలోని గ్రామకంఠాల ఖరారుపై తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సంప్రదించకుండా గ్రామ కంఠాలను ఎలా ఖరారు చేస్తారని ఆయన నిలదీశారు. గ్రామకంఠాలపై రైతుల వ్యతిరేకతను చంద్రబాబుకు ఎమ్మెల్యే వివరించారు. దీంతో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.