నేడు నంద్యాలకు జనసేనాని పవన్ కళ్యాణ్... ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పరామర్శ
ఏపీలో ఎన్నికలయ్యాక ప్రదానపార్టీల హడావిడి కొనసాగింది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ అయ్యారు. ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఎన్నికలు ముగిసిన దాదాపు నెలరోజుల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాక రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చిన పవన్ పోలింగ్ ముగిసిన తరువాత హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్నికల హడావిడి ముగియడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
మే 11వ తేదీ శనివారం నేడు కర్నూలు జిల్లా నంద్యాలకు జనసేన అధినేత పవన్ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి కన్నుమూసిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు . సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలో లోక్ సభ స్థాననుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన ఎస్పీవై రెడ్డి... అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఎస్పీవై రెడ్డి మరణించినప్పుడు అంత్యక్రియలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని అపుడు జనసేన పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ ఆ సమయానికి ఆయన రాలేకపోయారు . ఈ దృష్ట్యా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్ ఇప్పుడు వస్తున్నారు. ఎస్పీవై రెడ్డి చిత్రపటానికి నివాళుర్పించి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శిస్తాడని .ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనను విడుదల చేశారు.