పవన్ కళ్యాణ్..చిరంజీవిల్లో ఒకరు బీజేపీ సీఎం : జనసేన విలీనం అవుతుంది: కాషాయం నేత సంచలనం..!!
జనసేనను ఏ పార్టీలో విలీనం చేయను..ఇదీ పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట. అయితే పొత్తు ఉండదని మాత్రం చెప్పటం లేదు. కొద్ది రోజులుగా పవన్ తీరులో మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రధాని మీద ఘాటుగా విమర్శలు చేసిన పవన్..ఇప్పుడు ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తానా సభల సమయంలో అమెరికాలో బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ జనసేన అధినేత పవన్ తో కీలక భేటీ జరిగింది. ఆ తరువాత పవన్ వ్యాఖ్యల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ సీఎం అభ్యర్ధి పవన్ కళ్యాన్ అంటూ.. డిసెంబర్ లోగా జనసేన బీజేపీలో విలీనం అవుతుందంటూ కలకలం రేపారు.
ఇదే సమయంలో పార్టీ విలీనం చేయగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారని..చిరంజీవి బీజేపీ లోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీటి మీద రాజకీయంగా ఆసక్తి కర చర్చ మొదలైంది.
జగన్ హయాంలో తొలి సీబీఐ విచారణ : నవయుగ నుండి అడ్వాన్స్ రికవరీ : కేబినెట్ లో కీలక నిర్ణయం..!!
మెగా బ్రదర్స్ లో ఒకరు బీజేపీ సీఎం అభ్యర్ధిగా..
టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అన్నం సతీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వస్తారని..ఆయన కోసం ఢిల్లీ నాయకులు సైతం ఏపీకి వస్తారని చెప్పుకొచ్చారు. పార్టీని విలీనం చేస్తే ఆయనే ఏపీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారని..పవన్ ముఖ్యమంత్రి అవుతే చూడాలని ఉందన్నారు. అయితే, చిరంజీవి సైతం బీజేపీలోకి వస్తారనే ఆశాభావం వ్యక్తం చేసారు. చిరంజీవి బీజేపీలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారని వ్యాఖ్యానించారు. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని... ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. పవన్ బీజేపీలో చేరితే అది పార్టీకి..పవన్ కు సైతం మేలు చేస్తుందన్నారు. ఏపీలో ఇప్పుడు వైసీపీ..బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నం సతీష్ వ్యాఖ్యల ఆధారంగా అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే చర్చలు జరుగుతున్న విధంగా సతీష్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఏకంగా పార్టీ విలీనం గురించి సతీష్ సమయం కూడా చెప్పేస్తున్నారు. దీని ద్వారా జనసేన త్వరలోనే బీజేపీలో విలీనం అవుతుందా అనే చర్చ మొదలైంది.
విలీనం లేదన్న పవన్...
కొద్ది రోజులుగా పవన్ కళ్యాన్ బీజేపీ నేతలకు మద్దతుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని ద్వారా ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే అంశం చర్చకు వచ్చింది. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్ అక్కడ బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ తో సమావేశమయ్యారు. ఆ తరువాత ఏపీలో అనేక సందర్బాల్లో తన పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేయమని కోరుతున్నారని.. తాను మాత్రం ఆ పని చేయనని చెప్పుకొచ్చారు. అయితే, పొత్తు అయినా ఉంటుందా లేదా అనే దాని పైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనూ..అదే విధంగా దక్షిణాది పైన వివక్ష చూపిస్తున్నారంటూ ప్రధాని మోదీ పైన పవన్ తీవ్ర విమర్శలు చేసారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ జగన్ కు అటు బీజేపీతో..ఇటు కేసీఆర్ తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేసారు. ఇక, ఇప్పుడు ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు. అనేక సందర్భాల్లో వారిద్దరి గురించి ప్రశంసిస్తూ ప్రసంగించారు. ఒక దశలో ఏపీ ప్రభుత్వం మీద వారిద్దరి కన్ను ఉందంటూ హెచ్చరించారు. రాజధాని తరలిస్తే మోదీ..అమిత్ షా ను కాదన్నట్లే అంటూ కొత్త భాష్యం తెర మీదకు తెచ్చారు. దీని ద్వారా పవన్ రాజకీయ వ్యూహాల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. వారిద్దరికీ పవన్ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే..ఖచ్చితంగా వారితో కలిసే ప్రయాణం చేస్తారనే విషయం స్పష్టమవుతోంది.
చిరంజీవి పైనా కీలక వ్యాఖ్యలు..
పవన్ కళ్యాణ్ బీజేపీ మీద చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో వచ్చిన మార్పును స్పష్టం చేస్తున్నాయి. దీంతో..ఇప్పుడు అన్నం సతీష్ చేసిన వ్యాఖ్యల పైన విశ్లేషణ సాగుతోంది. అయితే ఇదే సమయంలో సతీష్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించి చేసిన కామంట్స్ ఆసక్తి కరంగా మారాయి. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్న చిరంజీవి బీజేపీ లోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే చేసినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా బీజేపీ నేతలు చిరంజీవితో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగింది. అయితే, చిరంజీవి ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ, ఇప్పుడు సతీష్ చేసిన వ్యాఖ్యల ద్వారా మెగా బ్రదర్స్ ఇద్దరినీ బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుుతున్నాయా అనే సందేహానికి కారణమవుతున్నాయి. మరి సతీష్ వ్యాఖ్యల మీద జనసేన నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.