రాజకీయాల్లో ఇమడలేరా.. కాదు, నిలబడతాడు: పవన్పై చిరు, ఎప్పుడు పిలిచినా..
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్/విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్కు మంచి ఐడియాలజీ ఉందని, నిజాయితీపరుడు అని, ఉన్నతాశయం కలవాడు అని కితాబిచ్చారు.
పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!
చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఎల్లుండి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా 'తమ్ముడు'ను 'అన్నయ్య' ఆకాశానికెత్తుకున్నారు.
ఉన్నతాశయం కోసం పవన్ తపన
జనసేన పైన, పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం పైన ప్రశ్నించారు. దీనిపై చిరంజీవి స్పందించారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉత్సాహవంతుడు అని, నిజాయితీ వ్యక్తి అని, ముక్కుసూటి మనిషి అన్నారు. ఉన్నతాశయం కోసం పవన్ తపిస్తున్నారన్నారు.
మద్దతు ఉంటుంది.. దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మంచి ఆశయం కోసం పవన్ తపిస్తున్నప్పుడు తాము అండగా ఉంటామని చిరంజీవి చెప్పారు. పవన్ జనసేన పార్టీ పెట్టవచ్చునని, తాను కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చునని, ఇరువురి దారులు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే అన్నారు. చిరు, పవన్.. పలుమార్లు ఇదే విషయం చెప్పారు. దారులు వేరైనా లక్ష్యం ఒకటేనని చెబుతుంటారు.
పవన్ మెంటాలిటీకి రాజకీయాల్లో ఇమడలేరా అంటే..
పవన్ కళ్యాణ్ మెంటాలిటీకి రాజకీయాల్లో ఇమడలేరా అని ప్రశ్నించగా.. అతను రాజకీయాలకు కొత్త కాబట్టి, కొత్తగానే కనిపిస్తాడన్నారు. మోసం చేసే రాజకీయ నాయకులు ఉన్నప్పుడు.. అలాంటి వారి (పవన్ కళ్యాణ్) వల్ల కొత్తవి చూస్తామన్నారు. అంటే కొత్త రాజకీయం చూస్తామని అభిప్రాయపడ్డారు.
తట్టుకొని నిలబడతారు
పవన్ ఉన్నతాశయం కలవాడని, అన్నింటిని తట్టుకొని రాజకీయాల్లో నిలబడతాడని చెప్పారు. ఎలాంటి వాటినైనా తట్టుకొని నిలబడే శక్తి పవన్ కళ్యాణ్కు ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని తెలిపారు.
అందుకే రాలేదు
పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్లే ఖైదీ నెంబర్ 150 సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి రాలేదని చిరంజీవి చెప్పారు.
దాసరితో విభేదాలు లేవు
ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కేవల మీడియాలోనే వస్తుందని చిరంజీవి అన్నారు.
విభజన తర్వాత.. కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నా
విభజన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కొంత స్తబ్ధత ఏర్పడిందనేది వాస్తవమని చిరంజీవి చెప్పారు. దీని దృష్ట్యా తాము ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. అదే సమయంలో సినిమా తీయవలసి వచ్చిందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి దూరం కాలేదని, ఆ పార్టీ వెంటే ఉన్నానని చెప్పారు. ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉంటానని, పార్టీకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తద్వారా ఎప్పుడు పిలిచినా వెళ్తానని అభిప్రాయపడ్డారు.