చంద్రబాబుకు పవన్ కల్యాణ్ షాక్: పాపాలను అందరికీ పంచడానికే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై చంద్రబాబు మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.
Recommended Video
తమ పార్టీ హాజరు కాకపోవడానికి గల కారణాలను ఆయన వివరించారు. అఖిల పక్ష సమావేశం ఇప్పుడు కాదు, మూడేళ్ల క్రితం పెట్టాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిల పక్ష సమావేశం తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం పవన్ కల్యాణ్ ఓ లేఖ రాశారు.
ప్రజలను వంచించడానికే...
ప్రజలను వంచించే ఏ చర్యనైనా జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. హోదాతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తాము అఖిల పక్ష సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు
చంద్రబాబు ఢిల్లీలో ఆందోళన చేయాలి...
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తన పాపాలను అందరికీ పంచేందుకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పార్లమెంటు ముందు ఆందోళనకు దిగాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఢిల్లీ బాట పట్టాలని అభిప్రాయపడ్డారు.
తమిళ రైతుల స్ఫూర్తిగా ఆందోళన
తిలా పాపం తలా పిడికెడు అనే పద్ధతిలో మీ పాపంలో అందరికీ భాగం పంచుతారా అని పవన్ కల్యాణ్ అడిగారు. తమిళ రైతుల స్ఫూర్తిగా ఢిల్లీలో ఆందోళనకు దిగాలని, చంద్రబాబు ఆ ఆందోళనకు దిగితే కేంద్రం దిగి వస్తుందని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధుల అందరితో కలిసి పార్లమెంటు ఆందోళనకు దిగాలని అన్నారు.
కుట్రలో భాగం కావద్దని....
చంద్రబాబు కుట్రలో భాగం కావద్దనే ఉద్దేశంతో తాము అఖిల పక్ష సమావేశానికి హాజరు కావడం లేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఉద్యమం ఉసురు తీయడానికి శతవిధాల ప్రయత్నించిన ముఖ్యమంత్రి ఇప్పుడు హోదా ఉద్యమానికి నాయకత్వం వహించడం ఏమిటని ప్రశ్నించింది. పెద్దమనిషిగా వ్యవహరించడం ఏమిటని అడిగింది. అఖిల పక్ష సమావేశం చంద్రబాబు పన్నిన మరో కుట్ర అని, అందులో తాము భాగస్వాములను కాదలుచుకోలేదని స్పష్టం చేసంది.
లేఖపై ఎలా చర్చిస్తుంది...
అఖిల పక్ష సమావేశానికి బిజెపి కూడా దూరంగా ఉంటోంది. చంద్రబాబుపై తాజాగా బిజెవైఎం ఎపి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అమిత్ షా లేఖపై అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. బిజెపి జాతీయాధ్యక్షుడి హోదాలో లేఖ రాస్తే అది అవమానించడం ఎలా అవుతుందని ఆయన అడిగారు. అసెంబ్లీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలా మారిందని అన్నారు.