అందుకేనా?: పవన్ కళ్యాణ్ లండన్ టూర్, ప్రవాసులతో భేటీలు
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ వచ్చే నెల (జులై 9న) విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ పర్యటనకు వెళుతున్న ఆయన అక్కడ ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
తొలుత యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేష్ (యుక్తా) ఆధ్వర్యంలో జరుగుతున్న 'జయతే కూచిపూడి' ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. కళారంగానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న యుక్తా 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు.
అనంతరం యూకే, యూరప్లోని తన అభిమానులు ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. 'యుక్తా'కు చెందిన గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా, పవన్ వెళ్తున్నది ఈ వేడుక కోసమే అయినా అక్కడ తన పార్టీకి సంబంధించిన ఎన్నారైలతో మాట్లాడి వారిని సైతం కూడగట్టేందుకే ఆయన అక్కడకు వెళ్తున్నారని పలువురు చర్చించుకుంటుండటం గమనార్హం. కాగా, ప్రస్తుతం తన నూతన చిత్రం పనుల్లో పవన్ బిజీగా ఉన్నట్లు సమాచారం.