పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తిపై నాదెండ్ల మనోహర్: ఏపీ భవిష్యత్ కోసమే, వైసీపీవి ప్రజా వ్యతిరేక నిర్ణయాల
ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో జనసేన పార్టీ కలిసి పనిచేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార వైసీపీ నేతలు పొత్తుపై ఘాటు విమర్శలు చేశారు. దీనిని జనసేన నేత నాదెండ్ల మనోహర్ కౌంటర్ అటాక్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో కలిసి నడువాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా ఏపీ భవిష్యత్ ముఖ్యమని తేల్చిచెప్పారు.
శుభ పరిణామం
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ-జనసేన పొత్తు శుభ పరిణామమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా పోరాటం చేస్తాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. వైసీపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి మరింత వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. దీనిపై ఉమ్మడిగా గళమెత్తుతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏపీ భవిష్యత్ కోసం
బీజేపీతో జనసేన కలిసి పనిచేయడం.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమేనని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇందులో పవన్ కల్యాణ్ రాజకీయ అవసరాలకు చోటే లేదని తేల్చిచెప్పారు. జనసేన పార్టీ ఎప్పుడూ స్వార్థ రాజకీయాలు చేయదని, జాతి ప్రయోజనాలు తమకు ముఖ్యమని నొక్కి వక్కానించారు. విభజన చట్టంలోని హామీల అమలు జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. దీంతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేందుకు అవకాశం ఏర్పడుతోందన్నారు.
కీ డెసిషన్స్
మోడీ 2.0 ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలతో ప్రపంచ యవనికపై భారత్ మరింత బలపడిందని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. త్రిపుల్ తలాక్ బిల్లు, కశ్మీర్ విభజన, అయోధ్య తీర్పు, సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి కీలక అంశాలను ఆరు నెలల్లోనే పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో భారతదేశం పేరు ఉన్నత శిఖరాలకు చేరిందని చెప్పారు.