చంద్రబాబుకు షాక్: 8న జగన్ - పవన్ కళ్యాణ్ల కలయిక? వారి ప్రయత్నం
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రత్యేక హోదా కోసం కలుస్తారా? వారిని కలిపేందుకు ఇప్పటికే తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రత్యేక హోదా కోసం కలుస్తారా? వారిని కలిపేందుకు ఇప్పటికే తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడుదామని వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్తో కలిసి పని చేసే అంశంపై పలువురిలో అనుమానాలు రేకెత్తాయి. అదే నిజమైతే చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామమేనని చెప్పవచ్చు.
క్రెడిట్..
ఎందుకంటే, పవన్ - జగన్ కలిసి పోరాడితే క్రెడిట్ ఎక్కువగా జనసేన అధినేతకు వెళ్లే అవకాశాలున్నాయి. జగన్ నేరుగా పవన్ కళ్యాణ్కు ఆహ్వానం పలకనప్పటికీ.. హోదా కోసం కలిసి పోరాడుదామని చెబుతున్నారు.
పవన్ చెప్పేశారు
మరోవైపు, పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని, టిడిపి తనవంతు ప్రయత్నాలు చేయడం లేదని చెప్పారు. హోదా కోసం ఆయన గళమెత్తుతున్నారు.
హోదా నినాదం..
తాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక హోదా నినాదంతోనే ఆ పార్టీలకు మద్దతు ఇచ్చానని, ఇప్పుడు హామీ నెరవేర్చడం లేదని, కాబట్టి తాను కచ్చితంగా నిలదీస్తానని చెబుతున్నారు. హోదా కోసం వైసిపి సహా ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు.
మధ్యవర్తుల ప్రయత్నం
ఈ నేపథ్యంలో జగన్ - పవన్లు కలుస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఇరువురిని కల్పించేందుకు కొందరు మధ్యవర్తులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇద్దరి కలయికకు ముహూర్తం కూడా కుదిరినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అన్నీ కుదిరితే పవన్ - జగన్లు ఫిబ్రవరి 8వ తేదీన భేటీ కావొచ్చని అంటున్నారు.