అనంత నుంచే పవన్ కల్యాణ్: ఈ స్టార్స్ 'సీమ' పులులే, ఎందుకు?
ఎన్టీఆర్, చిరంజీవి తన రాజకీయ ఎంట్రీని రాయలసీమ నుంచి పోటీ చేయడం ద్వారా ఇచ్చారు. తాజాగా, పవన్ కల్యాణ్ అదే దారిలో నడిచే యోచనలో ఉన్నారు.
హైదరాబాద్: రాజకీయాల్లోకి ప్రవేశించే సినిమా హీరోలు రాయలసీమ నుంచే చట్టసభలకు ఎన్నిక కావడానికి ఆసక్తి కనబరస్తున్నారు. ఎన్టీ రామారావు నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ఆ మధ్య ప్రకటించారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది తొలుత పవన్ కల్యాణ్ ప్రకటించలేదు. కానీ, జనసేన పార్టీ ఆవిర్భావ రోజున తన పోటీపై స్పష్టత ఇచ్చారు. అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు. అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తానని అన్నారు. దీంతో పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా నుంచే ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారు.
రాయలసీమలోనే కాకుండా రాష్ట్రంలో అత్యంత వెనకబడిన జిల్లా అనంతపురం కావడం గమనార్హం. వెనకబడిన జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పడానికి వారు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ముందుకు వచ్చారా అనేది కూడా ఏమీ చెప్పలేం.
హిందూపురం నుంచి ఎన్టీఆర్....
తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు హిందూపురం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఓడిపోవడం అన్నది తెలుగుదేశం పార్టీకి తెలియదు. అది ఎన్టీఆర్ వారసుల స్థానంగా కూడా ఉనికిలోకి వచ్చింది.
తిరుపతి నుంచి చిరంజీవి...
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా రాయలసీమనే ఎంచుకున్నారు. తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆయన పాలకొల్లు నుంచి కూడా పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. ఆయనను రాయలసీమనే గెలిపించింది.
తండ్రి వారసుడిగా బాలయ్య హిందూపురం నుంచి..
గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నందమూరి హీరో, ఎన్టీఆర్ తనయుడు బాలయ్య హిందూపురం స్థానాన్ని ఎంచుకుని విజయం సాధించారు. ఎన్టీ రామారావు గెలిచినప్పటి నుంచి ఆ సీటు తెలుగుదేశం పార్టీదే కావడం విశేషం. అదే సీటులో బాలయ్యను ఓటర్లు గెలిపించి శాసనసభకు పంపించారు. బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ రాయలసీమలో అనుకూల వాతావరణం ఏర్పడి ఉంటుందని అనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ సైతం...
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రాయలసీమ నుంచే పోటీ చేసి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పవన్ కల్యాణ్ వరకు రాయలసీమ స్థానికులు కారు. సామాజిక సమీకరణల దృష్ట్యా, రాజకీయ ఎత్తుగడలో భాగంగా వారు ఈ జిల్లాను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సొంత ప్రాంతంలో తమకు మద్దతు ఎలాగూ ఉంటుంది కాబట్టి రాయలసీమలోని ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని వారు భావించి ఉండవచ్చు.
సీమలో జగన్ ప్రాబల్యం...
రాయలసీమలో ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాబల్యం ఉంది. ఇప్పుడు వైయస్ జగన్ ప్రాబల్యం ఉంది. రాయలసీమలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించగలిగితే పార్టీ అధికారంలోకి వస్తుందనేది కాంగ్రెసేతర పార్టీల చీఫ్ల నమ్మకం. ఇతర ప్రాంతాల్లో ఎలాగూ తమకు ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి రాయలసీమలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటే అధికారం చేజిక్కించుకోవడానికి వీలవుతుంది. మొదట్లో ఎన్టీఆర్ ఆలోచన అదే కావచ్చు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అంచనా కూడా అదే అయి ఉంటుంది. రాయలసీమలో జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి తన పోటీ పనికి వస్తుందని పవన్ కల్యాణ్ భావిస్తూ ఉండవచ్చు.