కధ అడ్డం తిరిగింది.. భంగపడ్డామా..! ఇక..మిగిలింది ఆ ఒక్కటే..!
అనుకున్నది ఒక్కటి. అయింది మరొక్కటి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ఎలాగైనా నిలబెట్టుకోవాలి. ఇందు కోసం ఒక మెట్టు దిగి పొత్తుకు రమ్మంటూ ఆహ్వానం. పాత మిత్రుల్లో ఒకరు ఎలాగో దూరమయ్యారు. వారికి ఓట్లు పడకుండా ఏపికి అన్యాయం చేస్తున్నారంటూ వారిని డామేజ్ చేయగలిగాం. ఇక, మనకు మద్దతు అయినా పెరగాలి..లేదా వ్యతిరేక ఓట్లు చీలాలి..అదే ఏపి అధికార పార్టీ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు వారి వ్యూహం బెడిసి కొట్టింది. దీంతో.. టిడిపి కి ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి.. ఆ పార్టీ అడుగులు ఎటు..
వ్యూహం బెడిసి కొట్టిందా..ఊహించేదేనా..
పాత మిత్రుడు పవన్ కళ్యాన్ ను తమతో కలిసి రమ్మని టిడిపి అధినేత..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఏపి సీయం వ్యూహాత్మకంగా బిజెపి పై పోరాటం చేద్దాం..మద్దతుగా నిలవండి అంటూ పిలుపునిచ్చారు. అయితే, జనసేన అధి నేత పవన్ మాత్రం అనేక తర్జన భర్జనల తరువాత ఈ ప్రతిపాదనను తోసి పుచ్చారు. కొంత కాలంగా ముఖ్యమంత్రి.. మం త్రి లోకేష్..టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకొని పవన్ కళ్యాన్ పలు ఆరోపణలు చేసారు. తొలుత పవన్ కు టిడిపి నుండి గట్టిగానే రియాక్షన్ వచ్చింది. ఆ తరువాత పవన్ - జగన్ మధ్య పొలిటికల్ వార్ ముదిరింది. ఈ సందర్బంలో 2014 పొత్తు లు..ఓట్లు టిడిపి నేతలు గుర్తు చేసుకున్నారు. పవన్ ను పొత్తుకు ఆహ్వానిద్దాం..పోయేది ఏమీ లేదు. వస్తే అదనపు బలం .. లేకుంటే తాము ముందు నుండి చెబుతున్నట్లుగానే బిజెపి-జగన్ - పవన్ ఒక్కటేననే విషయం విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొద్దాం అనేది టిడిపి వ్యూహం గా కనిపిస్తోంది. పవన్ టిడిపి తో పొత్తు పై తేల్చేసినా..టిడిపి నేతలు ఇంకా సంయమ నం పాటిస్తున్నారు. ఇంకా ఆశలు పెట్టుకున్నారేమో..
పవన్ కా..బాబు కా..ఎవరికి లాభం..
టిడిపి అధినేత పొత్తు ప్రతిపాదనను పవన్ తిరస్కరించారు. దీంతో..ఇప్పుడు పవన్ తన శక్తిని చాటుకొని ..ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పటం ద్వారా పార్టీలో ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, వామపక్షాల తో పొత్తు పెట్టుకోవటం వలన పెద్దగా ఓట్లు పెరిగే అవకాశం లేదనే భావన వ్యక్తం అవుతోంది. ఒక వైపు టిడిపిని విమర్శిస్తూ.. మరో వైపు చంద్రబాబు - పవన్ పార్టనర్స్ అని జగన్ ప్రచారం చేస్తున్న సమయంలో...పొత్తుకు వెళ్తే జగన్ వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లవుతుందనేది మరో అంచనా. దీంతో..చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించినా..వెనక్కు తగ్గకూడదని జన సేన అధినేత నిర్ణయించారు. ఇదే సమయంలో..తాము పవన్ ను ఏపి కోసం..దేశం కోసం కలిసి రమ్మంటే మోదీతో ఉన్న బంధం కారణంగా రాలేదని ప్రచారం చేసే అవకాశం తమకు దక్కిందని టిడిపి నేతలు చెబుతున్నారు. పవన్ తో పొత్తుకు ఆహ్వానించటం..పవన్ తిరస్కరించటం కారణంగా టిడిపికి నష్టం లేదని వారంటున్నారు. ఇక, ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలంటే..పవన్ - జగన్ కు బలమైన పోటీ దారుడిగా ఉండాలని వారు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ మాత్రం..గతంలో పవన్ కారణంగా టిడిపికి వచ్చిన ఓట్లు ఈ సారి రాకపోతే..టిడిపికి నష్టమనే వాదన జగన్ బలంగా వినిపిస్తున్నారు.
మిగిలింది ఆ ఒక్కటేనా..!
ఏ ఎన్నికల్లోనూ టిడిపి ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. అధికారంలోకి వచ్చినా..ఓడిపోయినా.. ఏదో ఒక పార్టీ మద్దతుతోనే ముందుకు సాగింది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. బిజెపి- పవన్ దూరం కావటం తో ఇక టిడిపికి మిత్రపక్షంగా కనిపిస్తోంది ఒకే ఒక్క పార్టీ. జాతీయ స్థాయి రాజకీయాల కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపా మని చంద్రబాబు చెబుతున్నా..తెలంగాణలో వచ్చిన ఫలితాలతో అంచనాలు మారుతున్నాయి. ఇక, ఏపిలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపికి హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని..చంద్రబాబు చెబుతున్న మాటలు ప్రజలు విశ్వసిస్తారా అంటే సందేహమే. అయినా..జగన్ కు ఓటు బ్యాంకు గా ఉన్న దళిత-మైనార్టీ ఓటు బ్యాంకు కొంత వరకైనా కాంగ్రెస్ చీలుస్తుందనే ధీమా టిడిపి నేతల్లో కనిపిస్తోంది. అయినా..రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో మాత్రం ఇరు పార్టీల నేతలు ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాన్ ప్రకటన తరువాత టిడిపి - కాంగ్రెస్ పొత్తు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.