జూనియర్ డాక్టర్లపై దాడులపై పవన్ స్పందన.. తక్షణం ఆ అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్
ఏపీలో జాతీయ మెడిసిన్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని, తక్షణం చర్యలు చేపట్టి వైద్య విద్యార్థులలో స్థైర్యం నింపాలని డిమాండ్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.
విజయవాడలో జూనియర్ డాక్టర్ చెంప పగలగొట్టిన పోలీస్ ఉన్నతాధికారి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగాడాక్టర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.ఇక విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఎన్ఎంసీబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న ఓ జూనియర్ డాక్టర్పై డీసీపీ చేయి చేసుకున్న ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అంతేకాదు అలిపిరి వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ ను టీటీడీ విజిలెన్స్ అధికారి కాలితో తన్నిన ఘటనపై కూడా ఆయన మండిపడ్డారు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల దగ్గరకు డీసీపీ హర్షవర్థన్ వెళ్లి ఆందోళననువిరమించాలని ఆదేశించారు. ఆందోళన విరమించుకోవడంతో సహనం కోల్పోయి డిసిపి హర్షవర్థన్ ఓ జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని చెంప పగిలేలా కొట్టారు . దీంతో జూనియర్ డాక్టర్లు పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వైద్య విద్యార్థులు .
తిరుపతిలో జూనియర్ డాక్టర్ ను కాలితో తన్నిన టీటీడీ విజిలెన్స్ అధికారి
ఇక తిరుపతిలోనూ ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. ఆందోళన చేస్తున్న జూడాలపై టీటీడీ విజిలెన్స్ అధికారి అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించటం తో పాటుగా కాలితో తన్నారు. దీంతో అలిపిరి వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళన ఉధృతం చేశారు . ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనలపై స్పందించిన పవన్ కళ్యాణ్ జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వ యంత్రాంగం తీరు బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.
వైద్య విద్యార్థులపై దాడులు బాధాకరం .. తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్
ఈ దాడులను తాము ఖండిస్తున్నామని తెలిపారు. విజయవాడ, తిరుపతి లో చోటు చేసుకున్న ఘటనలపై తక్షణం ప్రభుత్వం స్పందించాలని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ప్రతిభతో కూడిన వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతపై ఇలా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదని ఆయన పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని, వారి డిమాండ్లపై స్పందించకపోగా దాడులకు పాల్పడిన హేయమైన చర్య అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎన్ఎం సి బిల్లు పట్ల జూనియర్ డాక్టర్లు , వైద్యులు ఆందోళన చేయడం పై సమగ్రమైన చర్చ జరగాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని పవన్ తేల్చిచెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం జూనియర్ డాక్టర్లపై చేసిన దాడి పై చర్యలు తీసుకుని వైద్యుల్లో, వైద్య విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.