రైతు భరోసాపై స్పందించిన పవన్ కళ్యాణ్.. 18,500 ఇవ్వాలని లెక్క చెప్పిన జనసేనాని
ఏపీ ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా ఏపీ రైతాంగానికి అందిస్తున్న రైతు భరోసా పథకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్పందనను తెలియజేశారు. నిన్న నెల్లూరు వేదికగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ పేరుతో ప్రారంభించిన ఈ పథకంలో రైతులకు 13500 పెట్టుబడి సాయం అందించనున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం జగన్ తో చిరు లంచ్ భేటీ: అసలు లక్ష్యం పవన్..ఆ ప్రతిపాదన సైతం : మెగా..వైసీపీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ..
కేంద్రం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులతో కలిపి రైతు భరోసా ఇవ్వటంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే ఎన్నికల ముందు వాగ్దానంలో భాగంగా జగన్ రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకోవటం లో విఫలమయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ని పీఎం కిసాన్ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అంతేకాదు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం 12,500 రూపాయల తో పాటుగా కేంద్రం ఇచ్చే ఆరువేల రూపాయలు కలిపి మొత్తం 18,500 రూ రైతులకు ఇవ్వాల్సి ఉందని జనసేనాని లెక్క చెప్పారు.
అలా కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇస్తున్న ఆరువేల రూపాయల తో కలిపి 13,500 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలను పక్కనపెడితే జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇస్తుంది కేవలం 7500 రూపాయలు మాత్రమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి, 7500 రూపాయలు ఇచ్చి, మిగతావి కేంద్రం ఇచ్చే వాటిని కలిపి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదన్నారు.
అందుకే మొత్తం 18,500 రూపాయలు కింద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ నుండి లేఖ విడుదల చేశారు. ఈ క్రమంలో పై విషయాలను పేర్కొన్న పవన్ కళ్యాణ్ వాస్తవాలను ప్రజలకు చెప్పి తాము ఇస్తానన్న మొత్తం ఇవ్వలేకపోతున్నామని అందుకు గల కారణాలను రైతులకు చెప్పాలని జగన్ ను డిమాండ్ చేశారు. అంతేకాదు ఎన్నికల హామీ ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని రైతులను అడగాలని కూడా ఆయన పేర్కొన్నారు.