ఆర్బీఐ నిర్ణయం కాస్త ఊరట .. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆదుకోవాలి : పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. కరోనా ఎఫెక్ట్ తో రైతాంగం నష్టపోతుందని , ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతులను ఆదుకోవాలని పవన్ సీఎం జగన్ను కోరారు.
మామిడి రైతులను ఆదుకోవాలి.. రుణాల చెల్లింపు పొడిగించాలి
ఇక లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో చాలా మంది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించారు. ఇక అంతే కాదు స్వయం సహాయక సంఘాల వారు కరోనా ప్రభావంతో బయటకు వెళ్ళలేని పరిస్థితిలో , ఎలాంటి సంపాదన లేకుండా ఉన్నారని , ఇక వారి రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సభ్యుల ఆవేదనను తగ్గించాలని కోరారు.
ఆర్బీఐ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పవన్
కరోనా వైరస్ రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక అంతే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రశంసించారు. ఆర్బీఐ నిర్ణయం సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రుణాలు చెల్లింపులపై మూడు నెలలు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని పవన్కళ్యాణ్ ప్రశంసించారు.
మూడు నెలల పాటు అందరూ తమ ఉద్యోగులను కాపాడుకోవాలని పవన్ విజ్ఞప్తి
అన్నిరకాల రుణాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ ప్రకటన అనంతరం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నగదు క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లింపులు వాయిదాకు అనుమతించడం లాభదాయకమన్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రజలకు ఎంతో భరోసానిచ్చే అంశం ఇదని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రభుత్వాలు మాత్రమే రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించలేవని, వ్యక్తిగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందన్న పవన్ చిన్న, మధ్యతరహా పరిశ్రమ కలిగిన వారో, బహుళ జాతి సంస్థకు చెందినా వారో, ప్రైవేట్ రంగానికి చెందినా వారో అయినా మీ ఉద్యోగులను మూడు నెలల పాటు కాపాడుకోండి అంటూ పవన్ పేర్కొన్నారు.