పవన్, ఆర్జీవీల నోట ఒకే మాట.., అవిశ్వాసానికి మేం రెడీ, రాహుల్ కూడా ఓకే: రఘువీరా రెడ్డి
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన దర్శకుడు ఆర్జీవీ ఒక్కోసారి విమర్శలు కురిపిస్తారు.. మరోసారి ప్రశంసల్లో ముంచెత్తుతారు. అవి చూస్తుంటే అసలు వీళ్లిద్దరూ సన్నిహితులా? లేకపోతే విరోధులా? అని కూడా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ఇద్దరి నోట ఒకే మాట రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
పార్లమెంట్లో టీడీపీ ఎంపీల నిరసనల తీరుపై అనుకోకుండా ఇటు పవన్ కళ్యాణ్, అటు రామ్ గోపాల్ వర్మ ఒకే విధమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీల నిరసనలపై రెండ్రోజుల క్రితం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. సోమవారం పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా టీడీపీ ఎంపీల నిరసన శైలిని విమర్శించారు. ప్లకార్డులు, విచిత్ర వేషాలతో ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఇలా ఇద్దరి నోటా ఒకే మాట రావడంతో.. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి తామూ సంసిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోక్సభలో 184వ నిబంధన కింద ఇప్పటికే తాము నోటీస్ ఇచ్చామని, నోటీస్పై చర్చతోపాటు ఓటింగ్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
Recommended Video
ఒకవేళ ఆ నోటీస్ను స్పీకర్ అనుమతించకపోతే.. తామే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే రాహుల్ గాంధీతో మాట్లాడానని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి రాహుల్ అనుమతి కూడా ఇచ్చారని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
అంతేకాదు, ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తమకు ఎవరి మద్దతు అక్కర్లేదన్నారు. తమతో ఉన్న 14 పార్టీల సభ్యులు సరిపోతారని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత ఖర్గేకు రాహుల్ తగిన ఆదేశాలిచ్చారని తెలిపారు. విభజన చట్టంలో లోపాలుంటే సవరించాలని కోరుతున్నామని, సవరణలకు మద్దతివ్వడానికి తాము సిద్ధమని రఘువీరా స్పష్టం చేశారు.