ఇసుక పోరు: రెండువారాల తర్వాత అమరావతిలో పవన్ ఆమరణ దీక్ష..వైరల్ అవుతున్న పోస్ట్
ఏపీలో ఇసుక కొరత కు నిరసనగా, భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండువారాల డెడ్ లైన్ పెట్టారు. ఈ రెండు వారాలలో ఇక సమస్యలు పరిష్కరించడంతో పాటుగా, ఇసుక కార్మికుల ఆదుకోవడానికి చేసిన డిమాండ్ లపై కూడా వైసిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు.
ఇక ఇదే సమయంలో రెండు వారాల్లో ప్రభుత్వం ఇసుక కార్మికుల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో వైరల్ అవుతున్న లెటర్లో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో చేసిన లాంగ్ మార్చ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని, రెండు వారాల్లో భవన నిర్మాణ కార్మికులకు రక్షణ మరియు చనిపోయిన కార్మికులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని అందులో ఉంది.
నవంబర్ 17వ తేదీన అనగా ఆదివారం ఉదయం 9 గంటలకు గుంటూరు జిల్లా అమరావతి నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నానని, ఇక దీనికి మద్దతుగా ఏడో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలని పిలుపునిచ్చినట్లు గా రాసి ఉంది. అయితే ఇది ఫేక్ అని జనసేన మీడియా విభాగం శతఘ్ని వివరణ ఇచ్చారు. జనసేన అధికారిక సోషల్ మీడియాలో వచ్చిన సమాచారమే సరైన సమాచారం అని శతఘ్ని పేర్కొన్నారు. ఇది ఫేక్ ప్రెస్ నోట్ అని పేర్కొన్న జనసేన సోషల్ మీడియా ఇలాంటి వార్తలను నమ్మవద్దని తేల్చి చెబుతోంది.