పవన్ ది వన్ మ్యాన్ షో...అది చాలా ప్రమాదకరం:మంత్రి కళా వెంకట్రావ్
విజయనగరం:జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావ్ విమర్శల వర్షం కురిపించారు. పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయం తెలియనటువంటి వాళ్లు ప్రాంతాలు, మతాలను రెచ్చగొట్టడం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Recommended Video
సోమవారం విజయనగరంలో మంత్రి కళా వెంకట్రావ్ మీడియాతో మాట్లాడుతూ..."పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందలేదు...పవన్ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా రాబోయే తరాలు ఎంత బాధపడతారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలంటే ప్రాంతాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టేవి కాదు. ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం ఉందంటున్నారు. అయితే దానిపై నీ పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుంది'...అని తప్పుబట్టారు.
పవన్ జనసేన అంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ కూడా కాదని...కేవలం వన్ మ్యాన్ షో అనొచ్చని అన్నారు...పవన్ విష బీజాలు నాటేలా వ్యాఖ్యలు చేస్తున్నారని...అది చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. సినీ నటుల గురించి మాట్లాడుతూ..."దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సహా మిగతా పెద్దలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టి సేవ చేస్తామని వచ్చారు. కానీ విద్వేష రాజకీయాలు చేయడం మంచిది కాదు. ప్రజలను రెచ్చగొట్టటంతో అందరికీ ప్రమాదమే"...అన్నారు.
కాపుల రిజర్వేషన్లపై పవన్ మాట్లాడుతున్నారు...పవన్...మీ స్నేహితులు బీజేపీ వాళ్ల దగ్గర ఉన్న రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పాస్ చేయించాలి. అయితే ఇలా చేసి ఓ సామాజిక వర్గానికి సాయం చేయడం మానేసి ప్రాంతాలు, కులాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టడం తగదు. జనసేనది అనేది ఒక స్వరూపం లేని పార్టీ. మీ పార్టీ పాలసీ ఏంటి, స్వరూపం ఏంటో చెప్పడం నాయకుల లక్షణం. తెల్లవారితే సీఎం చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్పై, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడం తగదని పవన్ కల్యాణ్కు కళా వెంకట్రావ్ హితవు పలికారు.