బాబు పై పవన్ నిశ్శబ్ద యుద్దం..! 2019ఎన్నికల్లో లో ప్రభావం చూపే దిశగా జనసేనాని అడుగులు..!!
హైదరాబాద్/ఏపి: టీడీపీ అతడిని బీజేపీ ఏజెంట్ అంటోంది. జగన్ ఏకంగా టీడీపీ నమ్మినబంటు అంటాడు. కాంగ్రెస్ తిక్కమనిషి అంటుంది. బీజేపీ మాత్రం ఎటుగాకుండా చూస్తూ ఉండిపోతుంది. ఇంతమంది.. ఎదురుదాడి చేస్తూ.. ఎవరికివారు.. అతడిని ఎవరో ఒకరి ఖాతాలో వేస్తూ విమర్శలు గుప్పిస్తుంది. అతడు మాత్రం వీలుచిక్కినప్పుడల్లా టీడీపీను. కాంగ్రెస్ను. బీజేపీ, వైసీపీలను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా.. ఇన్ని పార్టీల్లో తనకెవరు ప్రధాన శత్రువు అనేది మాత్రం గుర్తించలేకపోతున్నాడు. కానీ.. అందరూ తనను శత్రువుగా చూస్తుంటే ఏం చేయాలో పాలుపోక .. రాజకీయ చందరంగంలో తాను మంత్రిగా మారతానా. పీఠం ఎక్కి రాజు అవ్వగలనా అనే మీమాంశలో ముందుకు సాగుతున్నాడు. ఆయనే జనసేన అధినేత పవన్కళ్యాణ్. ఎవరు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా తన టార్గెట్ మాత్రం చంద్రబాబే అన్నట్తుగా ముందుకు వెళ్తున్నారు జనసేనాని.
టీడిపి పై విమర్శల జోరు పెంచిన పవన్..! చంద్రబాబుపై జాతీయ స్థాయిలో విమర్శలు..!!
నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో టీడీపీ.. ప్రత్యేకహోదాపై పెదవి విప్పలేదు. పైగా ప్యాకేజీ పేరిట కేంద్రం ఎక్కువే ఇచ్చిందంటూ ఏకంగా నాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఘనంగా సత్కరించారు. గజమాలతో పూజలు చేసినంతటి పనిచేశారు. అటువంటి సమయంలోనే పవన్ కేంద్రం ఇచ్చే ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలంటూ ఎద్దేవాచేశారు. దీనిపై టీడీపీ నేతలంతా పవన్ను ఏపీ అభివృద్ధి పట్టదంటూ ఎండగట్టారు. ఈ సమయంలోనే బీజేపీతో టీడీపీ దూరమవటంతో పవన్ టీడీపీపై మాటల దాడి పెంచాడు. ఈ దఫా చంద్రబాబు, లోకేష్ అవినీతిని అస్త్రంగా దూకుడు పెంచాడు. ఏపీలో యాత్ర చేపట్టి మరీ అవినీతిపై విమర్శలకు దిగటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోయింది.
Recommended Video
ఏపీలో విచిత్ర మలుపు తీసుకున్న రాజకీయం..! పవన్ వర్పెస్ టీడిపిగా మారిన సమీకరణాలు..!!
దీంతో అప్పటి వరకూ పవన్ను విమర్శించని టీడీపీ, పవన్కళ్యాణ్ బీజేపీ ఏజెంట్గా విమర్శలు అందుకుంది. పైగా పవన్ నాడు ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానంటూ ముఖంచాటేశాడంటూ ఎద్దేవాచేశారు. స్టాండింగ్ కమిటీ పేరిట ఏర్పాటుచేసిన కమీటీ నివేదికను కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్స్పై జగన్ ఇదంతా కేంద్ర పరిధిలోకి పోతుందంటూ చెప్పటం కూడా టీడీపీ అనుకూలంగా మలచుకుంది. అయితే పవన్ తాను కాపుల వైపు స్పందిస్తే కాపు అనే ముద్రను జనసేనకు వేస్తారనే ఉద్దేశంతో ఆచితూచి స్పందించారు.
పవన్ ను బీజేపి ఏజెంట్ గా చిత్రీకరిస్తున్న టీడిపి..! ఘాటుగా కౌంటర్ ఇస్తున్న తెలుగుతమ్ముళ్లు..!!
జగన్పై విశాఖలో జరిగిన కోడికత్తిదాడిపై సహజంగానే పవన్ స్పందించాడు. కానీ దీన్ని కూడా టీడీపీ రాజకీయం చేసి అనుకున్నది సాధించింది. పవన్ కూడా ఇటీవల జగన్ విమర్శించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల ఓ సమావేశంలో బీజేపీ హిందూ పార్టీ కాదంటూ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకే కోవకు చెందిన పార్టీలంటూ స్పందించారు. దాన్ని కూడా టీడీపీ అండ్ కో పవన్ బీజేపీ ఏజెంటేనంటూ వేలెత్తిచూపారు. ఈ నేపథ్యంలోనే పవన్ చెన్నై పర్యటన ఆసక్తిగా మారింది. కమల్హాసన్, రజనీకాంత్ లతో సమావేశం అవుతారనే ప్రచారం సాగుతుంది. ఇదే వేళ అభిమానులతో మాట్లాడిన పవన్ 2019లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆశలు పెంచుకున్న వామపక్షాల ఆశలపై నీళ్లుచల్లారు. దీనికి మరో కారణం.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్తో వామపక్షాలు పొత్తుపెట్టుకోవటాన్ని కారణంగా చూపేందుకు పవన్కు అవకాశం చిక్కింది.
పవన్ టార్గెట్ చంద్రబాబె..! ఎంతవరకు ఫలితం ఉంటుంది..?
ఇటీవలే తమిళనాడు, కర్ణాటకలో ఏపీ సీఎం చంద్రబాబు చుట్టొచ్చారు. ఇటువంటి సమయంలో పవన్ జాతీయరాజకీయాలను ప్రభావితంచేసేలా.. మరో కూటమికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేలా చేస్తున్నారా అనే అనుమానాలూ లేకపోలేదు. ఏమైనా.. జనసేనకు ప్రత్యర్థుల జాబితా క్రమంగా పెరుగుతుంది. పైగా ఏపీలో 2019 ఎన్నికల నాటికి ఎవరు ఎలా మారతారనేది పక్కనబెడితే.. ఇప్పటికైతే జనసేన పట్ల అందరూ వైరి వర్గంగానే భావిస్తున్నాయి. అలాగనీ.. పవన్లో పార్టీలన్నీ శత్రుత్వంతోనే ఉంటాయా! అనేది కూడా ఊహించలేని అంశం. ఇవన్నీ పక్కనబెడితే పవన్కళ్యాణ్ కనిపించి.. కనిపించకుండా తనపై విరుచుకుపడుతున్న శత్రువులతో మాయా యుద్ధం చేస్తున్నట్టుగానే జనసైనికులు భావిస్తున్నారు.