పీక్ టైమ్ లో రెండు పడవల మీద కాళ్ళు పెట్టిన పవన్ .. సినిమాలు , రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తారా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రధాన సమస్యలు పీక్స్ లో ఉన్న టైమ్ లో రెండు పడవల మీద ప్రయాణం మొదలు పెట్టారు. మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్న పవన్ పింక్ రీమేక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . అయితే రాజకీయాల్లో రాణించాలని సినిమాలకు గుడ్ బై చెప్పి వచ్చి జనసేన పార్టీ పెట్టిన జనసేనాని రాజకీయాల్లో ఇప్పటి వరకు సక్సెస్ చూడలేదు. ఒడిదుడుకుల మధ్య పార్టీ ప్రస్థానం సాగుతుంది. ఇదే సమయంలో ఆయన సినిమాలపై దృష్టి పెట్టటం పవన్ అసలు రెండు రంగాల్లో రాణిస్తారా ? ఏ మేరకు సక్సెస్ అవుతారు ? అన్న సందేహాలకు కారణం అవుతుంది .
పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన: జనసేనతో పాటు బీజేపీ కలిసి సాగుతుందా?
రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న జనసేనాని
సినీస్టార్ నుండి నుండి పొలిటీషియన్ గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, గత ఎన్నికల్లో ఏపీలో పోటీచేసి కేవలం ఒక్క స్థానానికే పరిమితమయ్యారు. కనీసం ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోయారు. ఇక ఈ నేపథ్యంలో ఇక ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఊపిరి ఉన్నంతవరకు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తానని,రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇక పార్టీ కార్యక్రమాల్లోనే కాదు, ప్రభుత్వ పాలన మీద నిప్పులు చెరుగుతూ ప్రజా క్షేత్రంలో ప్రతిపక్ష పార్టీల పాత్రను పోషించారు.
వరుస సినిమాలతో బిజీ అయిన పవన్
తాజాగా సినిమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్లో నటిస్తోన్న ఆయన.. ఆ తర్వాత వరుసగా మరో రెండు సినిమాలకు చేసేందుకు అంగీకారం తెలిపారు. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు కానీ అది సాధ్యమా అన్న ప్రశ్న అటు జనసైనికుల్లోనే కాదు రాజకీయ వర్గాలలోనూ ఉత్పన్నం అవుతుంది .
ఉదయం సినిమా షూటింగ్లు.. సాయంత్రాలు రాజకీయ సమాలోచనలు
ఉదయం సినిమా షూటింగ్లు.. సాయంత్రాలు రాజకీయాలకు సంబంధించిన అప్ డేట్స్ తెలుసుకొనే పనిలో పవన్ ఉంటున్నారని సమాచారం . ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్న పవన్ ఆ తర్వాత క్రిష్, హరీశ్ శంకర్ దర్శకత్వంలోని చిత్రాల్లో నటించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే వకీల్ సాబ్ తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్కి యూనిట్ సర్వం సిద్ధం చేస్తోంది.
ఐదు రోజులు షూటింగ్ లకు గ్యాప్ .. కర్నూలు , అమరావతి పర్యటన
ప్రస్తుతం ఐదు రోజుల పాటు సినిమా షూటింగ్కు గ్యాప్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు .ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రాజకీయ భేటీలో భాగంగా కర్నూలు వెళ్లనున్నారు పవన్ . రెండు రోజులపాటు స్థానిక నేతలతో సమావేశమై పార్టీ వ్యవహారాలపై చర్చిస్తారని అంటున్నారు. మొన్నటి వరకూ పూర్తిగా రాజకీయాలకే సమయాన్ని కేటాయిస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాల కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెబుతున్నారు. అందుకే వరసగా సినిమాలను అంగీకరించారని సమాచారం .
ఏపీలో దారుణ రాజకీయ పరిస్థితులు .. పవన్ రెండు పడవల మీద కాళ్ళు..
ఇక కర్నూలు పర్యటన అనంతరం అమరావతికి చేరుకుంటారు పవన్. ఫిబ్రవరి 15న రాజధాని విషయంపై అక్కడి రైతులతో సమావేశం అవుతారని అంటున్నారు. ఆ సమావేశం అనంతరం నేరుగా హైదరాబాద్ చేరుకుని మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం . ఏది ఏమైనా ఏపీలో రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండకపోవటం జనసేన వర్గాలకు ఒకింత నిరాశ కలిగించే అంశమే . ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ పవన్ ముందుకు సాగటం ఒకింత కష్టమే అని భావిస్తున్న నేపధ్యంలో చూడాలి జనసేనాని ఏం చేస్తారో ...