ఇసుక స్టాక్ పాయింట్స్ ఆకస్మిక తనిఖీ చేసిన పవన్ ... కొత్త ఇసుక పాలసీలో పారదర్శకత ఇదేనా అని ప్రశ్న
Recommended Video
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వైసిపి పాలనపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక ఆయనపై వైసీపీ ఎదురు దాడి చేస్తున్నప్పటికీ ఆయన తన పంధా మాత్రం వీడటం లేదు . గతంలో ఇసుక కొరత పై స్పందించిన పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ కు నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని, ఇసుకను అందించాలని లేఖ రాశారు. ఇక తాజాగా ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తరువాత పరిస్థితులపై ఆయన క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నేడు ఆయన కొత్త ఇసుక విధానంపై స్పందించనున్నారు.
ఇసుక స్టాక్ పాయింట్స్ వద్ద పవన్ క్షేత్ర స్థాయి పరిశీలన
ఏపీ రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ అధినేత ఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా నవులూరులోని ఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంతేకాదు ఏపీ రాజధాని మంగళగిరిలో ప్రభుత్వ ఇసుక డిపోపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణదారులుపవన్ దృష్టికి తీసుకురావడంతో ఇప్పటికీ నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు తీర్చలేదని, ఇసుక సమస్య పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక దొరకటం లేదన్న పవన్
ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు ఆగిపోయాయని, టన్ను ఇసుకకు రూ.900 వసూలు చేస్తున్నారని కార్మికులు చెప్పారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ . కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రకటించిన ధరకే ఇసుకను విక్రయించాలి కదా అని ప్రశ్నించారు. కానీ స్టాక్ పాయింట్ వద్ద పరిస్థితి వేరేలా ఉందని ఇదేనా పారదర్శకత అని ఆయన మండిపడ్డారు. టన్ను ఇసుక రూ.370 అని చెప్పి అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. టన్ను ఇసుక 900 రూపాయలు వసూలు చేస్తున్నారని ఇదేమిటి అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
పారదర్శక విధానం ఇదేనా అని జనసేనాని ప్రశ్న గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల పేరుతో దోపిడీ చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం నేరుగా దోపిడీకి పాల్పడుతున్నదని పవన్ కళ్యాణ్ విమర్శించారు .పారదర్శక విధానం ఇదేనా అని జనసేనాని ప్రశ్నించారు. ఇసుక కొత్త పాలసీ అమలు చేసినప్పుడు చెప్పిన ధర ప్రకారం ఇసుక విక్రయించాలని సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆయన పేర్కొన్నారు. ఇక తాను ప్రభుత్వ విధానాలపై ఎలాపడితే అలా విమర్శలు చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వాటిపై మాత్రమే ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు.
నేడు కొత్త ఇసుక విధానం అమలవుతున్న తీరు పై స్పందిస్తానన్న పవన్
నేడు కొత్త ఇసుక విధానం అమలవుతున్న తీరు పై స్పందిస్తానని పవన్ పేర్కొన్నారు. ఒకప్పుడు 500 రూపాయలకు ట్రక్ ఇసుక వచ్చేదని, ఇప్పుడు 1400 వరకు చలాన కట్టించుకుని మళ్లీ మామూళ్ళ పేరుతో వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం సత్వరమే కొత్త ఇసుక విధానంలో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేసారు. నేడు వైసీపీ 100 రోజుల పాలనపై ఇవ్వబోయే నివేదికలో ఇసుక అంశంపై జరుగుతున్న అవకతవకలు స్పష్టంగా వెల్లడిస్తామని తెలిపిన పవన్ కళ్యాణ్ కొత్త ఇసుక విధానం పై నేడు స్పందించనున్నారు.