సింధు సిల్వర్ తీసుకొచ్చింది.. మరి ఏపీకి వెంకయ్య ఏం తీసుకొచ్చారు? : పవన్
కాకినాడ : కేంద్రం ప్రత్యేక హోదాను పక్కనబెట్టి.. ప్యాకేజీని ప్రకటించడం.. ఓవైపు ప్యాకేజీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. ప్యాకేజీని అందుకోవడానికి టీడీపీ రెడీ అయిపోవడం.. వీటన్నింటి నేపథ్యంలో.. పవన్ కాకినాడ సభ. ఎవరిని టార్గెట్ చేస్తారు..? ముందే చెప్పిన మూడంచెల భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి స్పష్టత ఇస్తారు..? ఇవీ పవన్ సభకు ముందు అందరి మదిలోను మెదిలిన ప్రశ్నలు.
మొత్తానికి పవన్ సభ ముగిసిపోయింది. అదే ఆవేశంతో మునుపటి ప్రసంగాల లాగే కాకినాడ సభ కూడా కొనసాగింది. తప్పొప్పుల చర్చ కూడా అప్పుడే మొదలైపోయింది. విమర్శలు.. విశ్లేషణలు.. ఇలా పవన్ స్పీచ్ కు సంబంధించి ఇప్పుడు ఎవరి లెక్క వారిది. సరే.. ఏదేమైనా పవన్ లేవనెత్తిన కొన్ని అంశాలు మాత్రం ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారాయి. అందులో ఒకటి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సింధు టాపిక్.
ప్రసంగం సందర్బంగా.. సింధు గురించి ప్రస్తావించిన పవన్.. 'ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ తీసుకొచ్చినందుకు గాను వెంకయ్య గారు సింధు గారికి సన్మానం చేయబోతున్నారని, మరి ఓ తెలుగు బిడ్డ దేశ ప్రతిష్టతను పెంచేలా మెడల్ తీసుకొస్తే.. మరి తెలుగు వారైన మీరు కేంద్రంలో ఉండి రాష్ట్రం కోసం ఏం చేశారని' కేంద్రమంత్రి వెంకయ్యను ప్రశ్నించారు పవన్. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా.. ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా ప్రాసతో కూడిన వ్యాఖ్యలు చేసిన వెంకయ్య.. ఇప్పుడు హోదా మాటెత్తితే మాత్రం ఆంగ్లంలో సమాధానాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
మొత్తానికి తన ప్రసంగం ద్వారా.. కేంద్రమంత్రి వెంకయ్యను ఇరకాటంలోకి నెట్టేసిన పవన్, దానికి సింధు అంశాన్ని జతకలిపి హోదాపై గట్టిగానే నిలదీసే ప్రయత్నం చేశారు.