నేడు, రేపు రాజధానిలో పర్యటించనున్న పవన్ .. రాజధాని రైతుల కోసం ఏం చెయ్యనున్నారో?
ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న భావన ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో ఏపీ ప్రజలకు కలిగింది. ఇక ఈ సందిగ్ధతకు నిన్న సీఆర్ డీఏ మీటింగ్ జరిగిన నేపధ్యంలో జగన్ ప్రకటన చేస్తే తెరపడుతుంది అని అందరూ భావించారు . కానీ జగన్ ఈ విషయంపై మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక నేడు,రేపు రాజధాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ రాజధానిలో పర్యటించనున్నారు.
రాజధాని తరలించవద్దన్న పవన్ కళ్యాణ్ ..అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటానని హామీ
రాజధాని మార్పు విషయంలో మంత్రి వ్యాఖ్యలతో చెలరేగిన రాజకీయదుమారం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఒకపక్క రాజధాని రైతులు రాజధాని తరలింపు విషయంలో నెలకొన్న గందరగోళంతో ఆందోళన బాట పట్టారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పారు. రాజధాని తరలించకుండా చూడాలని రాజధాని రైతులు పవన్ ను కోరారు. వారితో మాట్లాడిన వపన్ రైతుల సమస్యలు తెలుసుకున్నారు . వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్ము తో రాజధాని నిర్మాణం చేస్తున్నారని, గత పాలకులు అందులో అవకతవకలకు పాల్పడి ఉంటే వాటిని సరి దిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు పవన్ .రాజధాని రైతుల ఆవేదనను అర్థం చేసుకున్నానని...వారికి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. అంతే కాదు ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు రాజధానిలో పవన్ పర్యటించనున్నారు.
నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన ..
రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్న నేపధ్యంలోరాజధాని రైతులకు ఆయన అండగా ఉండనున్నారని తెలుస్తుంది. . రాజధానిపై మంత్రి బొత్స చేసిన ప్రకటనలపై రాజధాని రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లో పవన్ని కలసి తమ సమస్య వివరించిన నేపధ్యంలోనే ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. రెండు రోజులు రాజధానిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని పవన్ రాజధాని రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు మంగళగిరి మండలం నిడమర్రు నుంచీ పవన్ కళ్యాణ్ తన పర్యటన ప్రారంభిస్తారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పనులను పరిశీలిస్తారు. రోడ్లు, భవనాలు, ఎత్తిపోతల పథకాల్ని పరిశీలిస్తారు.
రాజధాని రైతుల పరిస్థితిపై సమీక్ష చేయనున్న పవన్
నవులూరు, కృష్టాయపా లెం, యర్రబాలెం గ్రామాల్లోనూ , అలాగే తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి గ్రామాలలో పర్యటించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇక ఆయన రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. శనివారం రాజధానిలోని ఆయన పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులు, రైతు కూలీలు మరియు ఇతర వర్గాలవారితో పవన్ సమావేశం ఏర్పాటు చేసి, రాజధాని ప్రాంత సమస్యలపై తన వైఖరి స్పష్టం చెయ్యనున్నారు. గతంలో ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటె నేరుగా చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్ళి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు రాజధాని విషయంలో రైతుల సమస్యను పరిష్కరించాలని, రాజధాని మార్పుపై జగన్ స్పష్టత ఇవ్వాలని కోరతారా అన్న ఆసక్తి ప్రస్తుతం కనిపిస్తుంది .