ట్యాక్స్ చెల్లించాల్సిందే, కానీ: ఏపీ వాహనాలకి షాక్, మధ్యంతర ఉత్తర్వు
హైదరాబాద్: అంతర్రాష్ట్ర పన్ను పైన హైకోర్టులో వాహన యజమానులకు ఒకింత షాక్ తగిలింది. రవాణా పన్ను చెల్లించాల్సిందేనని, అయితే, ఆ ట్యాక్స్ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర పన్ను రగడ సాగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుండి తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుండి వచ్చే వాహనాల పైన అంతర్రాష్ట్ర పన్ను విధిస్తోంది. దీని పైన పలు ప్రయివేటు వాహనాల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం పది రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన వాహన యజమానులు ట్యాక్స్ చెల్లించవద్దని సూచించింది. ఇది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికే వర్తిస్తుందని తెలిపింది.
కేసు తదుపరి విచారణను ఈ రోజు న్యాయస్థానం జరిపింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా పన్ను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ట్యాక్సును బ్యాంకుల్లో జమ చేయాలని సూచించింది. ఆ డబ్బులు దేనికీ వాడవద్దని షరతు విధించింది. ఇది కోర్టును ఆశ్రయించిన వాహన యజమానులకే వర్తిస్తుందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.
జగన్ కేసు వాయిదా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ వాయిదా పడింది. కేసు విచారణలో భాగంగా గురువారం నాడు జగన్, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, శ్రీనివాసన్, నిత్యానంద రెడ్డి, దాల్మియా కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు కేసును జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.