అనితపై బాబుకు ఫిర్యాదు!, రాజధానినుంచి పాలన... ఏపీ ఎన్జీవోల్లో చీలిక?
విజయవాడ: పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత పైన సొంత పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బుధవారం నాడు అసమ్మతి నాయకులు భేటీ అయ్యారు.
ఎమ్మెల్యే అనిత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా సమావేశమైన నాయకులు అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసే విషయమై చర్చిస్తున్నారు.
డిప్యూటేషన్కు కొందరు ఎపిఎన్జీవోలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పని చేసే విషయమై ఏపీఎన్జీవోల్లో చీలిక ఏర్పడిందా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఏపీ నుంచి పాలన సాగించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకోసం ఉద్యోగాలను రాజధానికి తరలించాలని చూస్తోంది. అయితే, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యల నేపథ్యంలో పలువురు ఉద్యోగులు అప్పుడే ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఇదే సమయంలో బుధవారం నాడు పలువురు ఎపిఎన్జీవోలు సిఎస్ కృష్ణారావును కలిశారు. వారిని కలిసిన వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎపిఎన్జీవోలు అని తెలుస్తోంది.
తాము డిప్యూటేషన్ పైన పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గుంటూరు, కృష్ణా జిల్లాల ఉద్యోగులు చెప్పారు. ఈ జిల్లాలకు చెందిన ఉద్యోగులు దాదాపు యాభై వేల మంది ఉన్నారు. తమ మధ్య ఎలాంటి చీలిక లేదని, ఇబ్బందులు ఉన్నవారు తర్వాత రావొచ్చునని ఎపిఎన్జీవోలు చెబుతున్నారు.