వైసీపీ ఏం చేస్తుందో కేంద్రానికి తెలుసా?: బీజేపీ-జనసేన పొత్తుపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు అంశంపై కేంద్రం స్పందించాలని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు మార్పు ప్రకటనను కేంద్ర ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.
బీజేపీ-జనసేన పొత్తుపై..
అమరావతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పయ్యావుల అన్నారు. జనసేన-బీజేపీ పొత్తుతో అంతిమంగా రాష్ట్రానికి మేలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం చేయగలిగే స్థాయిలో బీజేపీ ఉందని తెలిపారు. బీజేపీ, జనసేన రాజధాని అంశంలో ఎలా ముందుకెళ్తాయో అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కొత్త పొత్తుల శక్తి భవిష్యత్తులో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
కేంద్రానికి చెప్పే వైసీపీ చేస్తోందా?
కేంద్రానికి చెప్పకుండా తాము ఏదీ చేయడం లేదని రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోందని.. అంటే రాజధాని మార్పు కేంద్ర పెద్దల మద్దతుతోనే జరుగుతోందా? అని ప్రశ్నించారు. బీజేపీ తలచుకుంటే రాజధాని అమరావతి సమస్య వారికి చాలా చిన్నదని, అందుకే ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని పయ్యావుల కోరారు.
బీజేపీ భవిష్యత్తు తేలిపోతుంది..
రాజధాని అమరావతిపై బీజేపీ నిర్ణయం బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పయ్యావుల వ్యాఖ్యానించారు. కేంద్రం తలచుకుంటే రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపగలదో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో ఇటీవలే చూశామని తెలిపారు. అందుకే ఏపీ రాజధాని అంశంలో కూడా స్పందించాలని కోరారు.
బీజేపీతో కలిసి పవన్ పయనం..
బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నేతలను ఆయన కలిసి వచ్చారు. విజయవాడలో సమావేశం నిర్వహించి బీజేపీ, జనసేన నేతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పయ్యావులు పై విధంగా స్పందించారు. కాగా, ఏపీ సర్కారు ఏపీలో మూడు రాజధానులు ఉండాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూలు కూడా రాజధానులుగా ఉండనున్నాయని ప్రకటించింది. అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో సచివాలయం, కర్నూలు హైకోర్టు ఉండాలని ప్రతిపాదించారు. హైకోర్టు బెంచీలు అమరావతితోపాటు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.