రెచ్చిపోయిన టీడీపీ నేతలు: మహిళను కిందపడేసి.. కాళ్లతో తన్నారు..
స్థానికంగా నెలకొన్న కొన్ని సమస్యలపై సుధ అనే మహిళ వారిని ప్రశ్నించినందుకు ఆమెను కిందపడేసి మరీ కాళ్లతో తన్నారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అనంతపురం: మహిళలపై దాడుల విషయంలో టీడీపీ నేతల పేర్లు తరుచూ వార్తల్లోకి ఎక్కుతుండటం ఆ పార్టీ ఇమేజీని దెబ్బతీసేదిగా మారుతోంది. గతంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో టీడీపీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. అలాగే గుంటూరు చైర్ పర్సన్ జానీమూన్ ను బెదిరిస్తున్నారంటూ ఓవైపు మంత్రి రావెల విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
తాజాగా అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు ఓ మహిళపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. గత నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసినట్టు తెలుస్తోంది. స్థానికంగా నెలకొన్న సమస్యలపై సుధ అనే మహిళ వారిని ప్రశ్నించినందుకు ఆమెను కిందపడేసి మరీ కాళ్లతో తన్నారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఇద్దరు కలిసి మహిళపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. వీరి దాష్టికాన్ని ఎవరో వీడియో తీయడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు పయ్యావుల కేశవ్ అనుచరులేనని సమాచారం. ఇలాంటి ఘటనలపై పోలీసులను ఆశ్రయించినా.. పలుకుబడి ఉపయోగించుకుని నిందితులు బయటపడుతున్నారే తప్ప.. బాధితులకు మాత్రం న్యాయం జరగట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.