సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఎందుకు రావటం లేదో లాజిక్ చెప్పిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది .వైసీపీ విజయం సాధించింది. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్ స్వయంగా ఆహ్వానించినా టీడీపీ నేత చంద్రబాబు హాజరు కావటం లేదు. ఇక దీనిపై ఏపీలో చర్చ జరుగుతోంది. అయితే.. టీడీపీ నేతలు మాత్రం అందుకు కారణాలు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ప్రమాణం! ఆ రకంగా చరిత్రలో నిలిచిపోనున్న విజయవాడ!
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు రాని కారణం ఇదే అంటున్న పయ్యావుల కేశవ్
చంద్రబాబు వెళ్లాలనే అనుకున్నారని.. కానీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఆయన్ను వద్దని చెప్పడంతో ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు పయ్యావుల కేశవ్ . టీడీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడంపై చర్చ జరిగినప్పుడు చంద్రబాబు వెళ్లేందుకు సానుకూలంగా కనిపించారని.. కానీ మెజారిటీ సభ్యులు చెప్పిన లాజిక్ విని ఆయన కూడా నిర్ణయం మార్చుకున్నారని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం రాజ్ భవన్ లో కాకుండా బయట జరుగుతోందని.. దీంతో అది ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా పార్టీ కార్యక్రమంలా జరుగుతోంది కాబట్టి మీరు వెళ్లడం కరెక్టు కాదని మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్పడంతో చంద్రబాబు కూడా వెళ్ళాలనే ఆలోచన విరమించుకున్నారని చెప్పారు. సీనియర్ నేతల బృందాన్ని పంపించి, వారితో తాను రాసిన అభినందన లేఖ కూడా పంపాలని నిర్ణయించారని పయ్యావుల పేర్కొన్నారు .
జగన్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పనున్న టీడీపీ ప్రతినిధుల బృందం
ఇక జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే బృందంలో టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల - అచ్చెన్నాయుడు - గంటా శ్రీనివాసరావు ఉంటారు. కాగా తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబును కాబోయే సీఎం జగన్ ఆహ్వానించారు. ఆయన మంగళవారం చంద్రబాబుకు ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు పార్టీ కార్యక్రమంలో ఉండడంతో జగన్ తో మాట్లాడేందుకు వీలు కాలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు కార్యాలయ సిబ్బంది జగన్ కు వివరించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు ఫోన్ చేశానని... ఈ సమాచారాన్ని చంద్రబాబుకు చేరవేయాలని జగన్ చెప్పారు. అయితే... జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడంపై బుధవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఇలా పార్టీ బృందాన్ని పంపాలని నిర్ణయించారు
నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్ ..
ఇక నేడు తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించబోతున్న వేళ భారీ సంబరాలకు బదులుగా, ప్రమాణస్వీకారోత్సవాన్ని చాలా నిరాడంబరంగా నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అనవసర ఆడంబరాలను పక్కనబెట్టి, అభిమానులు, అతిథుల సౌకర్యాలకే పెద్దపీట వేశారు. ఎవరికీ అసౌకర్యం కలగడకూడదన్నది కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన . ఇక ఈ నేపధ్యంలో ఎక్కడా ఆడంబరాలకు తావులేని రీతిలోనే జగన్ అభీష్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు . ఇక చంద్రబాబు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.