పయ్యావుల తనను ఎందుకు కలిశారో చెప్పిన కేసీఆర్!: రేవంత్ ఎఫెక్టా?
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.
Recommended Video
ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసిన పయ్యావుల
తన కుటుంబంలో జరిగి పెళ్లికి ఆహ్వానించేందుకు గాను కేసీఆర్ను పయ్యావుల హైదరాబాదులోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా పెళ్లి పత్రికను ఆయనకు అందించారు.
పావు గంట పాటు ప్రగతి భవన్లో
ప్రగతి భవన్లో పయ్యావుల కేశవ్ దాదాపు పావు గంట ఉన్నారు. పెళ్లి పత్రిక ఇవ్వడంతో పాటు వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయని భావిస్తున్నారు. వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందనే విషయం తెలిసిందే.
పరిటాల శ్రీరామ్ పెళ్లిలో
కాగా, కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి కేసీఆర్ హాజరయ్యారు. అప్పుడు పయ్యావుల - కేసీఆర్ హెలిప్యాడ్ వద్ద కాసేపు మాట్లాడుకున్నారు. ఇది ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.
నాడు రేవంత్ ఇలా
కేసీఆర్ - పయ్యావుల భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలు అంశాల్లో భాగంగా దీనిని కూడా లేవనెత్తారు. పయ్యావుల వంటి నేతలు తెలంగాణలో టీడీపీని టార్గెట్ చేసుకున్న కేసీఆర్కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముందని రేవంత్ ప్రశ్నించారు. అంతేకాదు, ఏపీ టీడీపీ నేతలు కొందరు కేసీఆర్ నుంచి కాంట్రాక్టులు పొందారని ఆరోపించారు. ఆ తర్వాత ఆయన పార్టీని వీడారు.
ఫేస్బుక్లో కేసీఆర్
రేవంత్ ఆరోపణలు సంచలనం రేపాయి. రేవంత్ ఆరోపణల ప్రభావమో లేక మరేమో కానీ కేసీఆర్ అధికారిక ఫేస్బుక్లో పయ్యావుల ఎందుకు కలిశారో చెబుతూ ఫోటో పెట్టారు.తనను పెళ్లికి ఆహ్వానించారని అందులో పేర్కొన్నారు.