సముదాయిస్తున్నాం: రెబెల్స్పై చాకో, కాసు విజ్ఝప్తి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఎవరేం చేసేది ప్రజలు గమనిస్తున్నారని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమ పార్టీ చిత్తశుద్ధితో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ శానససభలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.
తమకు పార్లమెంటు శీతాకాలం సమావేశాలే చివరివి కావని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు వస్తుందని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్న తమ పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సముదాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. లోకసభలో లోక్పాల్ బిల్లుకు సహకరించాలని ఆయన అన్ని పార్టీలనూ కోరారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ విషయంలో అన్ని పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి కలిసి రావాలని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విభజన నిర్ణయం కేంద్రం తొందరపాటు చర్య అని ఆయన అన్నారు. తెలుగు ప్రజల కష్టనష్టాలను వివరించినా రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. సీమాంధ్ర కోసం మాత్రమే కాకుండా తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం చేతులు కలుపుదామని ఆయన అన్ని రాజకీయ పార్టీలను కోరారు.
రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకునే సమయం కాదని, తాను పార్టీల పేర్లు ఎత్తదలుచుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు కూడా కనుక్కుని, కలిసి ఉండేలా చర్యలు తీసుకుందామని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుకుదామని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరోసారి ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు.