2019 ఎన్నికల పై రఘువీరా క్లారిటీ : ఊహాగానాలకు తెర..
ఏపిలో 2019 ఎన్నికలకు సంబంధించి పిసిసి చీఫ్ రఘువీరా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపిలో టిడిపి -కాంగ్రెస్ పొత్తు పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. తెలంగాణ లో టిడిపి తో పొత్తు కారణంగానే ఓడిపోయాని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పిసిసి చీఫ్ రఘువీరా దీని పై స్పష్టత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఏపిలో తెలుగుదేశంతో పొత్తు అంశం పై గతంలో ఉన్న వేగం తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఏపిలో పొత్తు పెట్టుకుంటే ఏ మేర లాభం జరుగుతుందనే అంచనాలతో అటు టిడిపి..ఇటు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తెలంగాణ లో పొత్తు కారణం గా ఎటువంటి ఫలితం లేకపోగా..టిడిపి తో పొత్తు కారణంగానే కాంగ్రెస్ దారుణమైన ఓటమి చవి చూడాల్సి వచ్చిందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విజయశాంతి లాంటి వారు ఓపెన్ గా ఆరోపిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏపి పిసీసీ చీఫ్ సైతం పొత్తులపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పొత్తుపై నిర్ణయం తీసుకునే ముందు ఏపీసీసీని సంప్రదిస్తుందన్నారు. 175 నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణుల నుంచి లిఖితపూర్వకంగా తీసుకున్న మనోభావాల సారాంశాన్ని అధిష్ఠానానికి నివేదిస్తానని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని బూత్ కమిటీలను నియమించామన్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నామన్నారు. దీని ద్వారా..పరోక్షంగా పొత్తు ఉండదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసారనే చర్చ మొదలైంఇ.
ఇదే సమయంలో కొద్ది రోజులుగా కళ్యాణదుర్గం నుండి టిడిపి అధినేత ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో పిసిసి చీఫ్ దీని పై క్లారిటీ ఇచ్చేసారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా.. లేకున్నా కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తానని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. హిందూపురం ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. పొత్తులున్నా, లేకున్నా కళ్యాణదుర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకొంటానన్నారు. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందనే ధీమాతో ఉన్నానన్నారు. మరి...ఏపిలో ఎటువంటి నిర్ణయాలు అమలవుతాయో చూడాల్సిందే.