చిరంజీవితో పీసీసీ మాజీ అధ్యక్షుడి భేటీ: మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తారా? ఇద్దరూ రీ ఎంట్రీ ఇస్తారా?
అనంతపురం: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ వార్తలు వస్తున్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తోన్న సమయంలో.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి ఆయనను కలుసుకోవరం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు.
Recommended Video
బ్రాహ్మణి పొలిటికల్ గ్రాండ్ ఎంట్రీ? టీడీపీ సోషల్ మీడియా కోసం వర్క్షాప్..విందు: భర్తతో కలిసి..!
వ్యక్తిగత పర్యటనే అయినప్పటికీ..
నిజానికి- ఇది రఘువీరా రెడ్డి వ్యక్తిగత పర్యటన. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం పరిధిలోని నీలకంఠాపురం గ్రామంలో రఘువీరా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 52 అడుగులు. ఈ విగ్రహ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మే 29వ తేదీన ఈ భారీ హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నీలకంఠాపురం.. రఘువీరా స్వగ్రామం. తన సొంత ఖర్చుతో రఘువీరా ఈ విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలంటూ రఘువీరా చిరంజీవి దంపతులను ఆహ్వానించారు.
మెగాస్టార్తో సన్నిహిత సంబంధాలు..
రఘువీరా రెడ్డి, చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగారు రఘువీరా. వైఎస్ క్యాంప్ నేతగా, కాంగ్రెస్ దిగ్గజ నాయకుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ హఠాన్మరణం అనంతరం రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ.. ఆయన ఎటూ వెళ్లలేదు. కాంగ్రెస్లోనే కొనసాగారు.
చిరంజీవితో కలిసి 2014 ఎన్నికల్లో..
అదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, రాజ్యసభకు ఎన్నిక కావడం, మన్మోహన్ సింగ్ కేబినెట్లో చేరడం చకచకా సాగిపోయాయి. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రఘువీరా అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో రఘువీరా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చిరంజీవి పార్టీ ఎన్నికల ప్రచారానికి సారథ్యాన్ని సైతం వహించారు.
ప్రస్తుతం ఇద్దరూ సైలెంట్ మోడ్లోనే..
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదో తెలిసిన విషయమే. అయినప్పటికీ- చిరంజీవి గానీ, రఘువీరా గానీ.. ఇతర పార్టీల వైపు చూపులు సారించలేదు. తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు. సినిమాల వైపు దృష్టి సారించారు. అటు రఘువీరా కూడా రాజకీయాల వైపు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. పీసీసీ అధ్యక్ష పదవికి ఏడెనిమిది నెలల కిందటే ఆయన రాజీనామా చేశారు. పొలం పనులు, కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు. అదే సమయంలో తన స్వగ్రాహంలో 52 అడుగుల ఎత్తు ఉన్న భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించారు.
ఇక మళ్లీ క్రియాశీలక రాజకీయాల వైపు..
రఘువీరా మళ్లీ క్రియాశీలక రాజకీయాల వైపు దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదు. ఆయన సన్నిహితులందరూ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, ఆనం రామనారాయణ రెడ్డి, అంబటి రాంబాబు.. వంటి సీనియర్లందరూ వైసీపీలో ఉన్నారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ రావడమంటూ జరిగితే వైసీపీతోనే ఉంటుందనే అభిప్రాయాలు ప్రస్తుతం అనంతపురం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. చిరంజీవి సైతం వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తుండటంతో.. ఇద్దరూ మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వొచ్చని చెబుతున్నారు.