వైసీపీలోకి పీసీసీ మాజీ అధ్యక్షుడు: జగన్తో ముగిసిన మంతనాలు..చేరిక లాంఛనమే?
అనంతపురం: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. త్వరలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు పూర్తయినట్లు చెబుతున్నారు.
వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం..
రాజకీయాలను పక్కన పెడితే- రఘువీరా రెడ్డికి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు కుడిభుజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ కేబినెట్లో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణం అనంతరం రఘువీరా కాంగ్రెస్లోనే కొనసాగారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు.
రాజకీయాలకు దూరంగా..
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కూడా దాదాపుగా కోల్పోయిన పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఆశించిన ఫలితాలను ఆయన రాబట్టుకోలేకపోయారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఒక్క అభ్యర్థి కూడా అసెంబ్లీకి ఎన్నిక కాలేదంటే ఆ జాతీయ పార్టీ ఏ దుస్థితికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రఘువీరా పీసీసీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకొన్నారు. వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టారు.
వైసీపీ నుంచి పిలుపు అందడంతో..
రఘువీరా రెడ్డి మళ్లీ క్రియాశీలక రాజకీయాల వైపు అడుగులు వేయడానికి కూడా వైఎస్ఆర్సీపీనే కారణమనే వాదన కూడా అనంతపురం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. తన తండ్రికి ఆప్తుడిగా.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న రఘువీరా రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ ఆసక్తితో ఉన్నారని, ఆయన ఎప్పుడొచ్చినా సరే.. స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇదివరకే ఇచ్చారు. అటు- రఘువీరాకు కూడా వైసీపీ ఆహ్వానాన్ని తిరస్కరించడానికి పెద్దగా కారణాలేవీ లేవనే చెబుతున్నారు.
Recommended Video
సహచరులంతా వైసీపీలోనే..
రఘువీరా మళ్లీ క్రియాశీలక రాజకీయాల వైపు దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదు. ఆయన సన్నిహితులందరూ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, ఆనం రామనారాయణ రెడ్డి, అంబటి రాంబాబు.. వంటి సీనియర్లందరూ వైసీపీలో ఉన్నారు. తాజాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలోకే చేరారు. క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ రావడమంటూ జరిగితే వైసీపీతోనే ఉంటుందని, అది లాంఛనప్రాయం మాత్రమేనని చెబుతున్నారు.