అమరావతి భూదందా కథనాలు: సాక్షి జర్నలిస్టులపై పోలీసు చర్య
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూదందాలపై వరుస కథనాలు రాసిన సాక్షి మీడియా జర్నలిస్టులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వార్తాకథనాలు రాసిన జర్నలిస్టులపై కూడా చర్యలు తీసుకుంటామని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు హెచ్చరిక నేపథ్యంలో సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. గుంటూరు పోలీసులు సాక్షి సిబ్బందిని పోలీసులు స్టేషన్కు పిలిపించి విచారించారు. వార్తాకథనాలకు ఆధారాలు చూపాలని పట్టుబట్టారు.
రిపోర్టర్లనే కాకుండా డెస్క్ జర్నలిస్టులను కూడా పిలిపించి విచారించారు. అయితే, జర్నలిస్టులను పోలీసు స్టేషన్కు పిలిపించి విచారించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా (పిసిఐ) తీవ్రంగా స్పందించింది. ఒక పత్రిక జర్నలిస్టులను పోలీసు స్టేషన్కు పిలిపించడాన్ని తప్పు పట్టింది.
ఆధారాలు బయటపెట్టాలని అనడం పత్రికా స్వేచ్ఛకు భంగకరమని వ్యాఖ్యానించింది. ఈ కేసును పిసిఐ సూమోటా స్వీకరించింది. ఎపి ప్రభుత్వానికి, డిజిపికి, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టులు రాసిన కథనాలకు సోర్స్ చెప్పాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని పిసిఐ నిబంధనల్లో ఉందని చెబుతున్నారు.