అనంత రైతన్న ఆగ్రహం .. వేరుశనగ విత్తనాల కోసం రోడ్ పై బైఠాయించి పోరాటం
ఏపీలో విత్తన కొరత అన్నదాతలను ఆగ్రహానికి గురి చేస్తుంది. ఖరీఫ్ సీజన్ మొదలైనా విత్తనాల కొరత ఏర్పడడంతో రైతులు విత్తనాల సరఫరా చెయ్యలేని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కారు. అనంతపురం జిల్లాలో రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. విత్తనాల కోసం ఉరవకొండ రోడ్ పై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. విత్తనా సరఫరాలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి కన్నెర్ర చేస్తున్నారు.
ఆ టీడీపీ నేతకు చేదు అనుభవం .. 'రైతు భరోసా'కు వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ నేతలు
వేరు శనగ విత్తనాల కోసం ఆందోళనలో అనంత రైతన్నలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తనాల సంక్షోభం రైతులను ఇబ్బంది పెడుతుంది. . ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ విత్తనాల సరఫరాపై దృష్టి సారించకపోవటంతో రైతన్నలు రోడ్డెక్కారు . అనంతపురం జిల్లా రైతులు ఈరోజు మరోసారి పోరుబాట పట్టారు . వేరుశనగ విత్తనాలు అందిస్తామని పిలిపించి, చివరికి స్టాక్ లేదని వ్యవసాయ అధికారులు చేతులు ఎత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉరవకొండ-గుంతకల్ రహదారిపై గంటపాటు బైఠాయించిన రైతులు
జిల్లాలోని ఉరవకొండ మండలంలోని ఐదు గ్రామాల రైతులకు వేరుశనగ విత్తనాలను ఈరోజు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా రైతులంతా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు.అయితే ఉదయం 10 గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన అధికారులు ఇంకా వేరుశనగ విత్తనాల స్టాక్ రాలేదనీ, వచ్చాక సమాచారం ఇస్తామని చెప్పారు. దీంతో రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు న్యాయం చేయాలంటూ ఐదు గ్రామాల రైతులు ఉరవకొండ-గుంతకల్ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పోలీసులు శాంతింపజేయడంతో మెత్తబడ్డ రైతులు ఆందోళనను విరమించారు.
ఇంకా తీరని విత్తన సమస్య .. రోజుకో చోట ఆందోళన
మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వేరుశనగ రైతులు విత్తనాల కోసం రోడ్డుపై బైఠాయించారు. తమకు వేరుశనగ విత్తనాలను వ్యవసాయ అధికారులు సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు గుత్తిలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తే, రాయదుర్గంలో మార్కెట్ యార్డు ఎదుట ధర్నా చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విత్తన కొరత ఉన్న చోట్ల రైతులు కన్నెర్ర చేస్తున్నారు.