జేసీలది హత్యల సంస్కృతి, వారికి భయపడే: జగన్ సమక్షంలో పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలపై తాడిపత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్యలు చేయడమే జేసీ సోదరుల సంస్కృతి అని ఆరోపించారు. జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలని, ముప్పై ఏళ్లలో తాడిపత్రికి వాళ్లిద్దరూ ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద వడుగూరు చేరుకున్నసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్దారెడ్డి మాట్లాడారు.
చేతకాని దద్దమ్మలు
‘జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలు. 30 ఏళ్లలో తాడిపత్రికి వాళ్లు చేసినందేమీ లేదు. హత్యలు చేయడమే జేసీ సోదరుల సంస్కృతి. వారికి మనుషులను చంపడం అంటే అంత తేలిక. పోలీసు పికెటింగ్ సాక్షిగా విజయభాస్కర్ రెడ్డిని జేసీ వర్గీయులు హత్య చేశారు. జేసీ సోదరులు ఎంతటి నీచానికైనా పాల్పడతారు. కిష్టిపాడులో వర్గ కక్షలు పెంచారు' అని పెద్దారెడ్డి మండిపడ్డారు.
వారికి భయపడే ఓట్లు
‘తమ అభివృద్ధి చూసి తాడిపత్రి ప్రజలు ఓట్లు వేస్తున్నారని జేసీ సోదరులు అనుకుంటున్నారు. అయితే అది పచ్చి అబద్ధం. వారికి భయపడే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. తాడిపత్రిలోని గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి మాముళ్లు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ స్వేచ్ఛగా బతుకకూడదన్నదే జేసీ సోదరుల లక్ష్యం' అని పెద్దారెడ్డి ఆరోపించారు.
చరమగీతం పాడాల్సిందే
‘యాడికిలో ఒక్క ప్రభుత్వ జూనియర్కాలేజీ తీసుకు రాలేదు. మన పిల్లలు వ్యవసాయం చేసుకోవాలే తప్ప.. మనం బాగుపడటం జేసీ సోదరులకు ఇష్టం లేదు. నియోజకవర్గం పట్ల వారికి దయాదక్షిణ్యాలు లేవు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి మంచినీరు, సాగునీరు తీసుకువస్తాం. 30 సంవత్సరాలు మనం జేసీ సోదరులకు ఊడిగం చేశాం. ఇక వారి పాలనకు చరమగీతం పాడుదాం ' అని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రాణం ఉన్నంత వరకూ.. అదే కానుక..
‘నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉన్నాను. వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటా. జేసీ సోదరుల వంటి నాయకులు రాజకీయాల్లో ఉండటం మనకే నష్టం. మా కర్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. తాడిపత్రి గెలుపును పార్టీకి కానుకగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. తాడిపత్రిలో వైసీపీ జెండా ఎగురవేసి, వైయస్ విజయమ్మకు ఈ నియోజకవర్గాన్ని కానుకగా ఇద్దాం' అని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర అనంతపురంలో కొనసాగుతోంది.