రక్తంతో తడిసిన చరిత్ర: చంద్రబాబుపై పెద్దిరెడ్డి, భూమన ఫైర్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర అని అన్నారు. అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై సిబిఐ విచారణ చేపట్టాలని వారన్నారు.
రాప్తాడులో బుధవారం ఉదయం హత్యకు గురైన ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని గురువారం పెద్దిరెడ్డి, భూమన, అనంత వెంకటరామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్ది, అమర్నాథ రెడ్డి, తిప్పారెడ్డి, వై. విశ్వేశ్వర రెడ్డి, చాంద్ బాషా,కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి, పోతుదుర్తి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి, భూమన మాట్లాడుతూ.. ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని త్వరలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలను ఏపి సిఎం చంద్రబాబునాయుడు టార్గెట్ చేస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు హత్యాకాండకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు.
మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రసాదరెడ్డి హత్యను రాజకీయ హత్య కాదంటూ డీఐజీ, ఎస్పీ ప్రకటించడం దారుణమని అన్నారు.
పోలీసుల అండదండలతోనే టిడిపి నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న హత్యాకాండపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న హత్యాకాండపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.