వాటి వల్లే: సాక్షి మీడియాపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్య
చిత్తూరు: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ‘సాక్షి' దినపత్రిక, టీవీ చానల్లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి దినపత్రిక, టీవీ చానెల్ వల్లే జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మీడియాలో ప్రదర్శించిన అతి విశ్వాసం కారణంగానే అధికారంలోకి రాలేకపోయారని ఆయన అన్నారు. సదుం గార్గేయ నదిపై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య సస్వామి ఆలయంలో ఆదివారం ఆడికృత్తిక ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డికి ఆలయ కమిటీ వారు స్వామివారి శేషవస్ర్తాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని స్థానిక మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా, సాక్షి విలేకరి కనిపించలేదు. దీనిపై ఆయన ఆరాతీస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. సాక్షి మీడియా వైసీపీ కరపత్రిక అన్న ముద్ర ప్రజల్లో బలంగా పడిందన్నారు.
దానికి తోడు ఎన్నికల సమయంలో సాక్షి పత్రిక ప్రచురణలు, చానల్ ప్రసారాలు జగన్తో పాటు తమ పార్టీలో మితిమీరిన విశ్వాసాన్ని కల్పించాయని ఆయన తెలిపారు. ఆ మితిమీరిన విశ్వాసం తమను దెబ్బ తీసిందని ఆయన అన్నారు.