రామోజీని కలవడంలో తప్పేంటీ?: పెద్దిరెడ్డి, లక్ష కోట్లు ఎక్కడని బాబుపై మండిపాటు
హైదరాబాద్/విజయవాడ: తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష అడ్డుకుంటూ ప్రత్యేక హోదాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
జగన్ దీక్ష వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా సాధించకుంటే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఢిల్లీ చుట్టూ తిరిగి రూ. వెయ్యి కోట్లు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. హోదాతో సాధించే రూ. లక్ష కోట్లు ఎక్కడా అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాకు అడ్డుపడుతోంది చంద్రబాబేనని అన్నారు. నిరాహార దీక్ష చేయడం నేరం కాదని, కోర్టు అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు ఎక్కడ దీక్ష చేసిన అడ్డుకుంటారని, అందుకే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీ రావును జగన్మోహన్ రెడ్డి కలవడంలో తప్పేముందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పార్టీ అధినేతగా పెద్దల సలహాలు తీసుకునేందుకే రామోజీరావును కలిశారని వెల్లడించారు. దీంతో రామోజీరావుతో జగన్ కలయికను అధికారికంగా పెద్దిరెడ్డి ప్రకటించారు. రామోజీరావుని జగన్ కలవడాన్ని సమర్థిస్తున్నామని పెద్దిరెడ్డి చెప్పారు.
గతంలో రెండు సార్లు చంద్రబాబునాయుడు దీక్షలు చేశారని ఆయన గుర్తు చేశారు. మీడియా ప్రశ్నలకు బాబు ఇష్టమొచ్చినట్లు సమాధానాలు చెప్పడం చూస్తుంటే.. జగన్మోహన్ రెడ్డి దీక్షతో ఆయన భయపడినట్లు తెలుస్తోందని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి దీక్షను అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. దీక్షపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. హైకోర్టు అనుమతి వచ్చే వరకూ దీక్ష వాయిదా వేస్తామని చెప్పారు. రెగ్యూలర్ ఫాంలో రావాలని హైకోర్టు సూచించిందని తెలిపారు. సోమవారం నాడు రెగ్యూలర్ ఫాంలో హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. పోలీసుల సాయంతో దీక్షను అడ్డుకోవాలని చూస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
బాబు మెప్పు పొందేందుకే భాష, వేషాలు: నాగార్జున
మంత్రి రావెల కిషోర్ బాబుకు దీక్ష అంటే అర్థం తెలియకుండానే జగన్మోహన్ రెడ్డిది దొంగదీక్ష అనడం సిగ్గుచేటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ అధినేత నిరాహారదీక్ష గురించి మాట్లాడే నైతికహక్కు రావెలకు లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పించడానికి రావెల నానా భాషలు మాట్లాడుతూ, వేషాలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రావెల మాటలతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. దళితులకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్న రావెల తన అధికారం అడ్డంపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ నాగార్జున ధ్వజమెత్తారు.
కాగా, జగన్ దీక్ష చేస్తానంటేనే.. అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు అభద్రతా భావం కలుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మర్రి రాజశేఖర్ విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా చేసే దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
ప్రతిపక్షం గొంతు నొక్కాలనుకోవటం మంచిది కాదని సూచించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తున్నారని మర్రిరాజశేఖర్ ధ్వజమెత్తారు.