జగన్ ఆశయ సాధన గొప్పది : పెద్దిరెడ్డి, 'నారాయణ కోసమే బాబు గందరగోళం చేస్తున్నారు'
చిత్తూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన చాలా గొప్పదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం, విద్యార్థుల అభ్యున్నతి, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైయస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు.
చిత్తూరుకు చెందిన కార్పొరేటర్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కేపీ శ్రీధర్, మాజీ సర్పంచ్ శివకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు సత్యబాబు, టిడిపి నేతలు కట్టమంచి కుమార్.. పెద్దిరెడ్డి సమక్షంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు శ్రీధర్, శివకుమార్, సత్యబాబు, కట్టమంచి కుమార్ తెలిపారు.
పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయాలని పెద్దిరెడ్డి వారికి సూచించారు. చిత్తూరు కార్పొరేటర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు జగదీష్, నరేష్ చంద్రారెడ్డి, జస్టిన్ పాల్గొన్నారు.
'బాబుకు అనుకూలమైన వారికే పెద్ద పోస్టులు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తనకు అనుకూలమైన వారికి ఉన్నతమైన పోస్టింగ్లను ఇచ్చేందుకే చంద్రబాబు టీచర్ల బదిలీల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
ఏపీలో 8 వేల పాఠశాలలు మూసివేసి నారాయణ విద్యాసంస్థలకు మేలు జరిగిలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 2014 డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని విశ్వేశ్వర్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.