చంద్రబాబు అందుకే ఆఘమేఘాల మీద బెజవాడ వచ్చారు: పెద్దిరెడ్డి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆఘమేఘాల మీద విజయవాడ రావడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. నూతన రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు అలా వచ్చారని ఆయన అన్నారు.
ఈ నెల 14వ తేదీన తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. చంద్రబాబు రెండేళ్ల మోసపూరిత పాలనపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. చంద్రబాబు అనుచరులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం రాజధానిలో భూములు కొనుగోలు చేశారని ఆయన విమర్శించారు.
రాజధాని టెండర్ల వ్యవహారాలన్నీ రహస్యంగా చేశారని, జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా విచ్చలవిడగా దోచుకున్నారని విమర్శించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు లక్షా యాభై వేల కోట్ల మేర దోపిడీకి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతోనే వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని నిరంకుశ పాలనను ఎదిరిస్తూ అవినీతిని ఎండగడుతున్నందున్నే సాక్షి ప్రసారాలను నిలిపేశారని ఆయన అన్నారు. ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టిడిపికి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని అన్నారు.
చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించకపోవడానికి కారణం ఇసుక దోపిడీతో గొంతు కూరుకుపోవడమేనని మరో వైసిపి నేత పార్థసారథి విమర్సించారు.