100 ప్రశ్నలతో వైపీసీ ప్రజా బ్యాలెట్: చంద్రబాబు ఇరకాటంలో పడ్డారా?
అమరావతి: ప్రజా బ్యాలెట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సోమవారం ముగిసిన వైసీపీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రెండేళ్ల పాలనలో ప్రజలకు చంద్రబాబు చేసందేమీ లేదన్నారు.
ఇక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జులై 8 నుంచి గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఐదు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా వాగ్దానాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికన అనంతరం ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. చంద్రబాబు పాలన, ప్రభుత్వ హామీలపై 100 ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ను రూపొందించామని, దీనిని గడపగడపకు అందిస్తామని చెప్పారు.
ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా చంద్రబాబు పాలన బాగుందా? లేదా అనేది కనుక్కుంటామని అన్నారు. తాము రూపొందించిన ఈ ప్రజా బ్యాలెట్ ప్రశ్నలకు అవును కాదు అని సమాధానాలు ఇస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలనపై మార్కులు వేయాలని ప్రజలను కోరనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, ప్రజా బ్యాలెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలకు అప్పగించామని అన్నారు. ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం పూర్తి చేయాలని కోరామని అన్నారు. ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమ నిర్వహణ తీరుపై ప్రతిరోజు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు రెండేళ్ల పాలనపై తమ పార్టీ చేసిన పోరాటాల గురించి ప్రజలకు వివరింగా చెబుతామని ఆయన వెల్లడించారు. ఇక జులై 8న వైయస్ జయంతిని ఘనంగా నిర్వహించాలని కార్యవర్గ సమావేశం నిర్ణయించినట్టు పెద్దిరెడ్డి చెప్పారు.
ఆరోజున తెలుగు రాష్ట్రాల్లోని వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించి, పార్టీ జెండాలను ఆవిష్కరించాలని పార్టీ నాయకులకు సూచించామని చెప్పారు.