నంద్యాల గెలుపు నిజమేనా? ఐతే నా సవాల్ స్వీకరించు: బాబుకు పెద్దిరెడ్డి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
చిత్తూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీకి గెలుపు ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని, దాన్ని సాకుగా చూపించి ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ఊదరగొట్టుకోవడం సీఎం చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. నంద్యాలలో టీడీపీ నిజంగా గెలుపే అయితే, ఫిరాయించిన 20మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని, ఆ ఫలితాలను రెఫరెండంగా స్వీకరిద్దామని సవాల్ విసిరారు పెద్దిరెడ్డి.
గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఇప్పుడెందుకు రైతుల జపం చేస్తున్నారని ప్రశ్నించారు. మూడున్నరేళ్ల పాలనలో రైతులకు మేలు చేసే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయకపోగా, తనకు లాభం వచ్చే పురుషోత్తపట్నం, పట్టిసీమ వాటిపై దృష్టి పెట్టారని విమర్శించారు.
బాబుది కపట ప్రేమ
బీసీల పట్ల సీఎం చంద్రబాబుది కపట ప్రేమ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రూ. 40వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం 7వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. చంద్రబాబు పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని అన్నారు.
ఆనాడు దివంగత సీఎం వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం వల్ల లక్షలాది మందికి ఉన్నత చదువులు చేరువయ్యాయని జోగి రమేష్ అన్నారు. వైయస్ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత లభించారని మరో నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీసీల సంక్షేమాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు.