బాబు కూడా వాళ్ల హెలికాప్టర్లోనే తిరుగుతారు: టీ ప్రాజెక్టు కాంట్రాక్టులపై పెద్దిరెడ్డి
విజయవాడ: తెలంగాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, శానససభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిప్పికొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులను నవయుగ సంస్త చేస్తోందని ఆయన చెప్పారు.
నవయుగ సంస్థ ఎవరిదో తెలుగుదేశం పార్టీ నాయకులకు బాగా తెలుసునని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వారి హెలికాప్టర్లలోనే తిరుగుతారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టు పనుల్లో తమ పార్టీ నేతలకు ఏ విధమైన కాంట్రాక్టులు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన ఎపి భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుకు సూచించారు. తాము రెండు ఎకరాలను 2 వేల కోట్లు చేసుకోలేదని ఆయన అన్నారు.
వ్యాపారాలు చేసుకోకుండా రాజకీయాల మీద సంపాదించడం తమకు తెలియదని అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా రోడ్డు పనులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వేర్వేరు దేశాల్లో కూడా కంట్రాక్టు పనులు చేస్తున్నామని అన్నారు .అంతే తప్ప తెలుగుదేశం నాయకుల మాదిరిగా ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాల్లో కొనసాగడం లేదని అన్నారు.
హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి విమర్శించారు. చంద్రబాబును చూసి తుఫానే కాదు మబ్బులు కూడా పారిపోతున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రత్యేక హోదా వల్ల లాభం లేదన్న వాదనను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటికే హోదా పొందిన 11 రాష్ట్రాలతో పోటీ పడుతున్నారా అని ప్రశ్నించారు. ఎపి ప్రజల హక్కులను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు.
చంద్రబాబు పక్క రాష్ట్రమైన తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేని అసమర్థుడని పార్థసారథి వ్యాఖ్యానించారు. కృష్ణానదిని ఎడారిగా మారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.