రాత్రి 11గం. దాకా వేచి చూసినా?: పీతలపై మాగంటి వర్గం తిరుగుబాటు, తారాస్థాయికి విభేదాలు?
తాను దళిత మహిళను కాబట్టే ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని పీతల సుజాత వాపోతున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమగోదావరి: చింతలపూడి ఏఎంసీ(అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) ఛైర్మన్ నియామకంపై తలెత్తిన వివాదం ఇంకా సద్దుమణగకపోగా.. ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య అగాధాన్ని పెంచుతూనే ఉంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెబుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మాగంటి వర్గం వాపోతోంది.
మరోవైపు తాను దళిత మహిళను కాబట్టే ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని పీతల సుజాత వాపోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకున్నా వివాదం సద్దుమణగకపోవడంతో.. మున్ముందు ఈ విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
మంత్రి పుల్లారావు జోక్యం:
జిల్లా ఇన్ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు గత వారం చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీ గెస్ట్ హౌజ్ లో సమావేశం నిర్వహించగా.. ఎమ్మల్యే వైఖరికి నిరసనగా ఎంపీ మాగంటి వర్గానికి చెందిన కొంతమంది జెడ్పీటీసీలు రాజీనామాలు చేస్తామని బెదిరించారు.
పితాని అసహనం:
జెడ్పీటీసీలు రాజీనామాలు చేస్తామని బెదిరించడంతో మరో మంత్రి పితాని సత్యనారాయణ సహనం కోల్పోయారు. చేతనైతే రాజీనామాలు చేసుకోమని చెప్పారు. దీంతో జెడ్పీటీసీలు మరింత అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు ఇరు వర్గాలను కూర్చోబెట్టి రాజీ కుదర్చాలన్న ప్రయత్నానికి పీతల సుజాత సహకరించలేదు.
17మంది రాజీనామా:
తాము రాజీనామాలకు సిద్దపడ్డా.. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదన్న కారణంతో కామవరపుకోట, చింతలపూడి జెడ్పీటీసీలు గంటా సుధీర్బాబు, తాళ్లూరి రాధారాణితో పాటు చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాలకు చెందిన 17 మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను జెడ్పీ సీఈవోకు సమర్పించారు.
రాత్రి 11గం. దాకా వేచి చూసినా:
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచనతో ఇరు వర్గాలు కూర్చొని చర్చించుకోవాలని నిర్ణయించుకున్నామని, కానీ రాత్రి 11గం. దాకా వేచి చూసినా ఎమ్మెల్యే పీతల సుజాత మాత్రం అక్కడికి రాలేదని అందువల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని ఎంపీటీసీలు చెబుతున్నారు.
తమకు కనీస ప్రాధాన్యత లేకపోగా.. పనులు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.ఎన్నికలకు కేవలం 13 రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చినా తామంతా దగ్గరుండి కష్టపడి గెలిపించామని, అలాంటి మమ్మల్నే విస్మరిస్తారా? అని వాపోతున్నారు.
ఇదిలా ఉంటే, పీతల సుజాత దళిత సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే పదేపదే ఆమెను వివాదాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె నిర్ణయాలకు కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.