'అసెంబ్లీలో రౌడీల్లా, ప్యాక్షనిస్టుల్లా ప్రవర్తించిన వైసిపి', 'మార్షల్స్ దాడి'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రౌడీలు, ఫ్యాక్షనిస్టుల్లా ప్రవర్తించారని మంత్రి పీతల సుజాత శుక్రవారం నాడు మండిపడ్డారు. అసెంబ్లీ రెండోసారి వాయిదా పడిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హోదా పైన తాము చర్చకు సిద్ధమని ప్రకటించినా అడ్డుకోవడం సరికాదన్నారు.
వైసిపి నేతలు రౌడీ రాజకీయాలను అసెంబ్లీలోకి తీసుకొచ్చారన్నారు. రౌడీ రాజకీయాలు అసెంబ్లీలోకి వస్తే ఎలా ఉంటాయో ఈ రోజు చూశామన్నారు. ఓ వైపు ప్రత్యేక హోదాకు పట్టుబడుతున్నారని, మరోవైపు హోదాపై మాట్లాడేందుకు రెడీ అని చెబుతోంటే గొడవ చేయడం ఏమిటన్నారు.
వైసిపి నేతలు దారుణంగా దిగజారిపోయారన్నారు. రాష్ట్రం నష్టపోవడానికి కారణమన్నారు. రాష్ట్రాభివృద్ధి జరిగితే వారికి పుట్టగతులు ఉండబోవనే గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యుల తీరు అవమానకరమన్నారు. వైసిపికి ప్రజా సమస్యలు పట్టవన్నారు. స్పీకర్ వద్దకెళ్లి మైకులాగడం, కాగితాలు చించి వేయడం ఏమిటన్నారు.
మార్షల్స్ మాపై దాడి చేస్తారా: వైసిపి
అసెంబ్లీ సాక్షిగా మార్షల్స్ తమ పైన దాడి చేయడం ఏమిటని చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ పట్ల తాము అగౌరవంగా ప్రవర్తించలేదన్నారు. అబద్దాలు, అవాస్తవాలతో పుట్టిన పార్టీ టిడిపి అని ధ్వజమెత్తారు. దాడి చేసే అధికారం మార్షల్స్కు ఎక్కడిదన్నారు.
పాదాభివందనం: పవన్ 'సీమాంధ్ర' సభకు తెలంగాణ ఫ్యాన్స్, అందుకే రాక
హోదా పైన వైసీపీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. తమ హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి మేలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామన్నారు. తాము మార్షల్స్ పైన దాడి చేశారని చెప్పడం అబద్దమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
ప్లీజ్ డునాట్ టచ్ మెంబర్స్
స్పీకర్ పోడియం వద్ద ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైసిపి సభ్యులు నినదించడం, సభలో కుర్చీ పైకి ఎక్కి నినాదాలు చేయడం, మైకు విసిరివేయడం జరిగింది. దీంతో మార్షల్స్ వైసిపి సభ్యులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో సభాపతి కోడెల శివప్రసాద రావు.. ప్లీజ్ డు నాట్ టచ్ ది మెంబర్స్ అంటూ మార్షల్స్కు సూచించారు.