నాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది: రోజాపై పీతల సుజాత తీవ్ర వ్యాఖ్య
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాది ఆగ్రకుల దురహంకారమని, ఆమె శైలి, భాష, రెచ్చగొట్టే విధానాన్నే తాము తప్పుపడుతున్నామని మంత్రి పీతల సుజాత ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తమ జిల్లాలో అసలు ప్రతిపక్షమే లేదన్నారు.
రాజకీయాలలో ఒక గాడ్ ఫాదర్లా తనకు ఇంత జీవితం ఇచ్చిన సీఎం చంద్రబాబాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. నేను దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళనని, 2002లో నేను ఉపాధ్యాయురాలిగా పని చేశానని, 2004లో చంద్రబాబు పిలుపు మేరకు ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేశానని చెప్పారు.
తన తండ్రి దీవెనలతో, సీఎం చంద్రబాబు ఆశీర్వాదంతో నేను గెలిచానన్నారు. పార్టీ పట్ల విధేయత కలిగి ఉన్నానని చెప్పారు. 2009లో తనకు పోటీ చేసే అవకాశం దక్కలేదని, అయినా నిరుత్సాహపడలేదన్నారు. చంద్రబాబు కూడా ధైర్యం చెప్పారన్నారు. తాను రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారన్నారు.
అనంతరం చింతలపూడి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచానని చెప్పారు. జిల్లాలో తనకు పార్టీకి చెందిన నేతల నుంచి సహకారం లేదన్న వ్యాఖ్యల పైనా ఆమె స్పందించారు. అదేం లేదని, కానీ రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదన్నారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పారు.
తన దృష్టి అంతా అభివృద్ధి పైనే అన్నారు. తన పేరును ఉపయోగించుకొని దందాలు చేస్తున్న విషయం తనకు తెలియదన్నారు. తాను కాంట్రోవర్సీలకు దూరంగా ఉంటానని చెప్పారు. మంత్రి అయిన తొలి ఏడాది కొంత ఇబ్బంది పడ్డానని చెప్పారు. ఇప్పుడు అంతా సర్దుకుంది అన్నారు. వడ్డాణం బహుమతి, పదిలక్షల సంచి వంటి వ్యవహారాలు తన పైన చేసిన దుష్ప్రచారమని, ఈ ఆరోపణల వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందన్నారు.