ఏపీలో పెన్షన్ లబ్దిదారుల లొల్లి, 7 లక్షలకి పైగా పెన్షన్లు కట్.. రీజన్ ఇదే!
ఏపీలో
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల లొల్లి కొనసాగుతుంది . ఏపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉంది . కొత్తగా ఏపీ ప్రభుత్వం పింఛన్ పథకం విషయంలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ సంతోషంలో ముంచెత్తాయి. అయితే కొత్త మార్గదర్శకాలతో ఊహించని చిక్కు ఇప్పుడు పెన్షన్ లబ్దిదారులను నిద్ర పోనివ్వటం లేదనే భావన వ్యక్తమవుతున్నది.
కాపులకు గుడ్ న్యూస్ చెప్పిన వైసీపీ సర్కార్ .. మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్ధిక సాయం
కొత్త మార్గదర్శకాలతో 7 లక్షల మందికి పించన్ కట్
సామాజిక పింఛన్లు పొందేవారి వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది ఏపీ సర్కార్ . ఈ నేపథ్యంలో కొత్తగా ఆరు లక్షలమందిని ఈ పథకంలో చేర్చటం సంతోషం కలిగించే అంశం అయితే , కొత్తగా ఆరు లక్షల మందికి పింఛన్ మంజూరు చేసినట్టే చేసి పాతవారిలో ఏకంగా ఏడులక్షలమందికి పింఛన్ కట్ చేయటానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న వార్తలు గ్రామాల్లో టెన్షన్ కు కారణం అవుతున్నాయి.
కొత్తవారితో పాటు పాతవారికీ నిబంధనలు .. పెన్షన్ కోల్పోతున్న లబ్దిదారులు
ఏపీలోని వైసీపీ సర్కార్ గత నెల 13వ తేదీన పెన్షన్ పథకానికి కొత్త మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా చాలామంది పింఛన్ పథకానికి అనర్హులుగా మారారు. సాధారణంగా మార్గదర్శకాలను కొత్తగా లబ్ధిదారుల లిస్ట్ లోకి చేరే వారికీ వర్తింపజేయాలి. అలాగే చేస్తారు అని అనుకున్నారు కూడా . కానీ కొత్తవారికి పాతవారికి అందరికీ కలిపి ఒకే నిబంధనలు అమలులోకి తీసుకురావడంతో సామాజిక పింఛనుదారులకు పెద్ద కష్టం వచ్చి పడింది. కొత్త నిబంధనల ప్రకారం చాలా మంది పెన్షన్ కోల్పోనున్నారు.
గతంలో నిబంధనలు పాటించకుండానే పెన్షన్లు
గతంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోకుండా పెన్షన్లు మంజూరు చేశారు. కానీ ఇప్పుడు సర్కార్ వాటిని తొలగిస్తుంది. సొంత కారు ఉన్నా, నెలవారీ విద్యుత్చార్జీలు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నా అనర్హులే. పట్టణాల్లో చిన్న ఇల్లున్న వారికి గతంలో పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు కూడా పెన్షన్ తొలగించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో లబ్దిదారులు.. గ్రామ సచివాలయాల్లో అనర్హుల జాబితా
కడప జిల్లాలో 40 వేలు , నెల్లూరు జిల్లాలో 50 వేలకుపైగాలబ్దిదారుల పెన్షన్ కట్ కానుంది . అలాగే ప్రకాశంలో 70 వేలు, అనంతపురం జిల్లాలో లక్ష మందికి పైగా, పశ్చిమగోదావరిలో 20 వేలు, కృష్ణా జిల్లాలో 90 వేలు , పేర్లు అనర్హత లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మొత్తంగా 7 లక్షల మందికి పెన్షన్ కట్ కానున్నట్టు తెలుస్తుంది . కొత్త మార్గదర్శకాల ప్రకారం పింఛను పొందేందుకు నిబంధనల ప్రకారం అర్హత లేనివారి జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు మీకు అర్హత లేదు. మీ పేర్లు అర్హుల జాబితా నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పండి అంటూ గ్రామ సచివాలయాల్లో నోటీసు బోర్డులలో అతికిస్తున్నారు.
ఫిబ్రవరి ఒకటో తేదీన తుది జాబితాలు .. టెన్షన్లో లబ్దిదారులు
బోర్డులో పేర్లు చూసుకొని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు . గ్రామ సచివాలయంలోని సిబ్బందిని కలిసి పెన్షన్ రావటానికి ఏదో ఒకటి చేసి తమ పేరు తీసేయకుండా చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఇక కొంత మంది అయితే టీడీపీ అని తమ పేర్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రకటించే తుది జాబితాలో ఉంటామో లేదోనని భయపడుతున్నారు. అలాగే సీఎం జగన్ వచ్చి పెన్షన్ మొత్తం 3000 కి పెంచుతారని భావిస్తే వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.