ఏపీలో నేటి నుంచి ఇంటి వద్దకే పెన్షన్.. సంతోషంలో లబ్దిదారులు
ఆంధ్రప్రదేశ్ లోని నేటి నుండి ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం అమలు కానుంది. దీంతో పెన్షన్ కోసం పడిగాపులు పడే పరిస్థితి ఇక ముందు ఉండదని లబ్దిదారులు సంతోష పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులైన అవ్వా తాతలు, ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నారు.
నేటి నుండే ఇంటికే పెన్షన్లు .. నవశకం ద్వారా కొత్తగా 6.11 లక్షల మంది లబ్దిదారులు
రాష్ట్రంలో అర్హులైన వారందరినీ సంతృప్తి పరిచే విధంగా పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘నవశకం' కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కొత్తగా 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, వారందరికీ ఫిబ్రవరి నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అంతేకాదు నేటి నుండీ ఇంటికే వెళ్లి పించన్ అందిస్తున్నారు. కొత్తగా పింఛను మంజూరు చేసిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఇక సీఎం జగన్ లేఖను ఫిబ్రవరి 1వ తేదీన పింఛను డబ్బులు పంపిణీ చేసే సమయంలో వలంటీర్లు పించన్ మంజూరు ఉత్తర్వు పత్రాలతో పాటు లబ్ధిదారులకు అందిస్తున్నారు.
ఇంటికే పించన్ పంపిణీలో చిన్న చిన్న అవాంతరాలు
ఇంటికే పెన్షన్ పథకం అమలు కోసం నిన్ననే నిధులు విడుదల కాగా, వార్డు వాలంటీర్లు, ఈ ఉదయం 8 గంటల నుంచే తమ పనిని ప్రారంభించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 54.64 లక్షల మందికి పించన్ అందించనున్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ వాలంటీర్లు తమ వార్డు పరిధిలోని వృద్ధుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల బయో మెట్రిక్ సమస్యలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. వృద్ధుల వేలిముద్రలు సరిపోకపోవడంతో, వారికి రేపు ఇస్తామని చెబుతున్నట్టు సమాచారం.
లబ్దిదారులను ఉద్దేశించి లేఖ రాసిన సీఎం జగన్
ఇక సీఎం జగన్ ఇంటికే పించన్ అందించటంతో పాటు కొత్తగా పించన్ మంజూరు చేసిన వారికి శుభాభినందనంలు తెలిపారు. ఈ క్రమంలో రాసిన లేఖలో రాష్ట్రంలో అవ్వా తాతలు, పేదలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజా సంకల్పయాత్రలో చూసి తాను చలించిపోయానని , పేదలు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం నవరత్నాలలో ముఖ్యమైన వై ఎస్సార్ పించన్ పథకం మీదే పెట్టానని చెప్పారు.
లబ్దిదారులు ఆఫీసుల వద్ద పడిగాపులు పడకూడదనే ఈ నిర్ణయం
అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో నవశకం కార్యక్రమం ద్వారా కొత్తగా 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని లేఖలో చెప్పిన సీఎం జగన్ వారి కుటుంబాల్లో ఆనందం చూడాలని ఫిబ్రవరి నెల నుంచి పింఛన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకోవడం కోసం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, వ్యాధులతో బాధపడే వారు ఆఫీసుల వద్ద పడిగాపులు పడే పరిస్థితులు ఉండకూడదని సీఎం జగన్ వలంటీర్ల ద్వారా పించన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.