ప్రతీ నెలా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ..ఇంటివద్దకే వెళ్లి ఇస్తున్న వాలంటీర్లు..ఖుషీలో అవ్వా,తాతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటివద్దకే అందించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధిదారుల పెన్షన్ పంపిణీకి కూడా నేరుగా ఇంటికి వెళ్లి ఇవ్వటం కోసం ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది . నవశకంలో భాగంగా ప్రారంభించిన ఈ విధానం సక్సెస్ అయింది . దీంతో ఫిబ్రవరి నెల పెన్షన్ మొత్తాలను మార్చి 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి చేతికి అందించాలన్న ప్రభుత్వ సంకల్పం లో భాగంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
1478 .83 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం విడుదల చేసిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ నేటి నుండి ప్రారంభమైంది. ఈరోజు తెల్లవారుజాము నుండే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా వారి కోసం ప్రభుత్వం 1478 .83 కోట్ల రూపాయలను కేటాయించింది. అంతేకాదు 2.66 లక్షల మంది వాలంటీర్లు ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది సర్కార్. లబ్ధిదారులకు పెన్షన్లను బయోమెట్రిక్ మరియు ఐరిస్ విధానం ద్వారా అందజేస్తున్నారు. అంతేకాదు ఆర్ బి ఐ ఎస్ ద్వారా ఫేషియల్ అధ్నటికేషన్ నిర్వహిస్తూ పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు.
నేరుగా ఇంటికి వెళ్లి ఇస్తున్న వాలంటీర్లు
వైయస్సార్ పెన్షన్ కానుక కింద నేరుగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడానికి కావలసిన నగదును ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పంపిణీ చేసింది. గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల చేతికేపెన్షన్ మొత్తాలను అందచేయనున్నారు. ఇక ఈ విషయాన్ని సెర్ప్ సిఇఓ పి.రాజబాబు వెల్లడించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేరుగా ప్రజల వద్దకే పాలన అన్న చందంగా సంక్షేమ పథకాలను నేరుగా గడపగడపకు చేరేలా నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
సంక్షేమ ఫలాలు ఇంటికే చేరటంతో ఖుషీలో లబ్దిదారులు
ఇప్పటికే ఇంటింటికి రేషన్ కార్యక్రమం అమలవుతుండగా , పెన్షన్లు కూడా నేరుగా ఇంటికి వెళ్లే లబ్ధిదారులకు ఇస్తుండటంతో లబ్దిదారుల్లో హర్షం వ్యక్తం అవుతుంది . గతంలో పెన్షన్ కోసం పడిగాపులు పడే పరిస్థితి నుండి ఇప్పుడు ఇంటికే పెన్షన్ రావటంతో లబ్దిదారులు సంతోష పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులైనఅవ్వా తాతలు, ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నారు.ఇళ్ళలో కూర్చుని పెన్షన్ అందుకుంటున్నారు .